హుజురాబాద్ ఉప ఎన్నికల షెడ్యూల్ పై స్పష్టత లేనప్పటికీ, అన్ని ప్రధాన పార్టీలు హడావుడి ఎప్పుడో మొదలు పెట్టేస్తాయి.మరో రెండు, మూడు రోజుల్లో షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉందనే సమాచారంతో మరింత స్పీడ్ పెంచాయి.
ఈ నియోజకవర్గంలో గట్టి పట్టున్న రాజేందర్ ప్రభావాన్ని తగ్గించేందుకు టిఆర్ఎస్ తరఫున మంత్రి హరీష్ సీన్ లోకి దిగిపోయారు.ఇప్పటికే రాజేందర్ కు చెందిన ప్రధాన అనుచరులు అందరినీ టీఆర్ఎస్ వైపు తిప్పుకుని , వారికి కీలక పదవులు వచ్చేలా చేస్తున్న హరీష్ ఇప్పుడు తన మాటలకు మరింత పదును పెట్టారు.
టిఆర్ఎస్ ను వీడి బిజెపిలో చేరిన రాజేందర్ ను ఇరుకున పెట్టేలా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.
టీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరిన రాజేందర్ ప్రధాని నరేంద్రమోదీ ఫోటోలు ఎందుకు దాచి పెడుతున్నారని, ప్రచార పోస్టర్ లో కేవలం రాజేందర్ ఫోటో మాత్రమే వేసుకోవడం ఏంటని హరీష్ రావు నిలదీశారు.
ప్రధాని మోడీ ఫోటో వేసుకుంటే, భారీగా పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు ఓటర్లకు గుర్తుకు వస్తాయనీ, తనకు పడే ఓట్లు కూడా గల్లంతు అవుతాయి అనే భయంతో రాజేందర్ ఉన్నారని, అందుకే తన ఫోటోలు మాత్రమే ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు.ఆయన ఈ నియోజకవర్గంలో గెలిచినా చేసేది ఏమీ లేదు అంటూ హరీష్ ఎద్దేవా చేశారు.
రాజేందర్ తన ప్రభావంతో కేంద్ర నుంచి వెయ్యి కోట్లు తెచ్చే సత్తా ఉందా అంటూ హరీష్ ప్రశ్నించారు.గ్యాస్ సిలిండర్ ధర వెయ్యి చేశారని, భవిష్యత్తులో దాన్ని 1500 చేసినా ఆశ్చర్యపోనవసరం లేదని విమర్శించారు. దేశవ్యాప్తంగా బీజేపీ గ్రాఫ్ బాగా తగ్గిపోయిందని, ఇటీవల జరిగిన ఎన్నికలే దానికి ఉదాహరణ అని, హుజూరాబాద్ నియోజకవర్గం లోనూ ఆ తరహా ఫలితాలే వెలువడతాయని హరీష్ జోస్యం చెప్పారు.