రాజకీయ నాయకులకు సంబంధించి ఎప్పుడూ… ఏదో ఒక టాఫిక్ వైరల్ అవుతూనే ఉంటాయి.ఆ కథలు కథనాల వెనుక నిజమెంత అని ఆలోచించేవారు తక్కువ.
ఒక్కోసారి అసత్య కథనాలే వారి రాజకీయ భవిష్యత్తుని తలకిందులు చేయడమే కాదు… వారిమీద సొంత పార్టీ నేతలే అనుమానం పడేలా చేస్తాయి.ఇప్పుడు ఈ మ్యాటర్ అంతా ఎందుకు అంటే…టీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉండి నెంబర్ 3 స్థానంలో కొనసాగుతున్న హరీష్ రావు మీద గత కొద్దీ రోజులుగా అనేక కధనాలు వెలువడుతున్నాయి.
కేసీఆర్ తో ఆయనకు పొసగడం లేదని… కేటీఆర్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడంతో ఈ గ్యాప్ మరింత పెరిగింది అని ప్రచారం సాగుతోంది.అయితే ఈ కథనాలపై ఆ పార్టీకి చెందిన వారు కూడా ఖండించారు.
అసలు టీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు క్రేజ్ అంతా ఇంతా కాదు… అసంతృప్తి నేతలను బుజ్జగించడంలో కానీ… ఇతర పార్టీల్లో కీలక నాయకులను పార్టీలో చేర్చడంలో కానీ హరీష్ తన సత్తా చాటుతూ ఉంటాడు.అటువంటి హరీష్ రావు కాంగ్రెస్ లో చేరబోతున్నారంటూ ప్రచారం మొదలైంది.టీఆర్ఎస్ పార్టీలో తనకు మద్దతు ఇచ్చే దాదాపు 40మంది ఎమ్మెల్యేలతో కలిసి కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధంగా ఉన్నారంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అయ్యింది.దీంతో పార్టీలోనూ… బయటా పెద్ద దుమారమే రేగింది.
ఏంటి హరీష్ కాంగ్రెస్ లో కి వెళ్తున్నాడా అంటూ తెలంగాణ లో పెద్ద చర్చగా మారింది.
ఇంతకీ ఈ వార్త వైరల్ అవ్వడానికి కారణం … సోషల్ మీడియా లో ఓ అకౌంట్ నుంచి వచ్చిన పోస్ట్ కారణం.దీంతో రంగంలోకి దిగిన పార్టీ అధిష్టానం… ఇటువంటి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ జనగామ టీఆర్ఎస్ నాయకులు డీసీపీకి ఫిర్యాదు చేశారు.ప్రశాంత్ మణి అనే వ్యక్తి తన ఫేస్ బుక్ నుంచి మాజీ మంత్రి హరీష్ రావు 40మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ లో చేరబోతున్నారంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఆ పోస్ట్ పెట్టిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా డీసీపీని టీఆర్ఎస్ నాయకులు కోరారు.అయితే ఈ విషయం పూర్తిగా తెలుసుకోకుండానే హరీష్ రావు పార్టీ మారుతున్నారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగి అనవసర చర్చకు దారి తీసింది.