తెలంగాణలో బిజెపి బలపడుతోంది అనే సంకేతాలు చాలా కాలంగా వస్తున్నా, ఏకంగా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తుందని ఏ ఒక్కరు ఊహించలేకపోయారు.అసలు ఈ విజయాన్ని బీజేపీ నేతలు సైతం ముందుగా ఊహించలేకపోయారు.2018 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఒకే ఒక్క స్థానాన్ని దక్కించుకుంది.ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కొన్ని సీట్లను సాధించినా, ఎప్పుడు ఏ ఎన్నికలు బిజెపికి పెద్దగా కలిసి రాలేదు.కానీ ఇప్పుడు మాత్రం టీఆర్ఎస్ రాజకీయ భవితవ్యాన్ని ప్రమాదంలోకి నెట్టి మరీ బిజెపి ఇక్కడ విజయాన్ని సాధించింది.1470 ఓట్ల తేడాతో బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు విజయాన్ని సాధించారు.దీంతో టిఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత ఓటమిని చవి చూశారు.కేవలం ఒక స్థానంలో టీఆర్ఎస్ ఓటమి చవిచూసైనా ఇప్పుడు ఆ పార్టీకి, ప్రభుత్వానికి జరిగే నష్టం ఏమీ లేకపోయినా, ఆ ప్రభావం తప్పనిసరిగా రానున్న ఎన్నికల తో పాటు, ఆ తరువాత జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లోనూ గట్టి ప్రభావమే చూపించే అవకాశం కనిపిస్తోంది.
ముఖ్యంగా ఇక్కడ టిఆర్ఎస్ కు దుబ్బాక సిట్టింగ్ స్థానం కావడంతో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.ఇక్కడ బాధ్యతలన్నీ కేసీఆర్ మేనల్లుడు మంత్రి హరీష్ రావు భుజాన వేసుకున్నారు.
ఇక్కడ పార్టీని గెలిపించే బాధ్యత నాదే అని హరీష్ ధీమాను సైతం వ్యక్తం చేశారు.చాలా చోట్ల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న హరీష్ నన్ను చూసి ఓటేయండి అని … నేను చూసుకుంటా…” అని మంత్రి హరీష్ రావే ఎన్నికల ప్రచారంలో చాలా చోట్ల చెప్పారు.
హరీష్ రావు మాటలు సైతం పక్కనపెట్టి , దుబ్బాక ఓటర్లు బిజెపి వైపు మొగ్గు చూపారు.దీంతో హరీష్ రాజకీయ భవితవ్యంపై అందరికీ అనుమానాలు బయలుదేరాయి.
ఇప్పుడు ఈ ఓటమి బాధ్యతలను పూర్తిగా హరీష్ రావు మోయాల్సి ఉంటుంది.ఇప్పటికే టిఆర్ఎస్ లో రెండు గ్రూపులు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
ఒక గ్రూపు కు కేటీఆర్, మరో గ్రూప్ కు హరీష్ రావు సారథ్యం వహిస్తున్నట్లుగా చాలా కాలంగా టిఆర్ఎస్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.రెండోసారి టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత , హరీష్ రావు కు మంత్రి పదవి ఇవ్వకుండా కేసీఆర్ పక్కన పెట్టారు.
రానున్న రోజుల్లో కేటీఆర్ కు హరీష్ పోటీ అవుతారనే భయం కూడా కేసీఆర్ లో కనిపించింది.
కానీ అయిష్టంగానే హరీష్ కు ఆ తరువాత మంత్రి పదవిని కట్టబెట్టారు.
అలాగే హరీష్ కూడా పార్టీలో మునుపటిలాగే యాక్టివ్ గా ఉంటూ వస్తున్నారు.అయితే ఇప్పుడు దుబ్బాక ఫలితాలు బెడిసికొట్టడంతో హరీష్ రావు రాజకీయ భవితవ్యం పై నీలి నీడలు కమ్ముకునేలా చేశాయి.
అసలు ఫలితాలు ఈ విధంగా వస్తాయని కేసీఆర్ కు ముందే తెలుసునని, అందుకే తెలివిగా తన కుమారుడు కేటీఆర్ ను ఎన్నికల ప్రచారానికి వెళ్లకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించారని , ఒకవేళ ఇక్కడ ఫలితాలు అనుకూలంగా వస్తే అది టిఆర్ఎస్ ఖాతాలో వేసుకోవాలని , తేడా వస్తే హరీష్ రావును బలిపశువును చేయాలనే ఉద్దేశంతో కెసిఆర్ ముందు నుంచి ఉన్నారనే వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి.ఏది ఏమైనా ఎన్నికల ఫలితాలు మాత్రం టిఆర్ఎస్ రాజకీయ భవితవ్యంపైనా పార్టీ నాయకులు , జనల్లోనూ అనుమానాలు పెరిగేలా చేశాయి.
ముఖ్యంగా హరీష్ రావు కు టిఆర్ఎస్ లో ఇక ప్రాధాన్యం పెద్ద గా ఉండే ఛాన్స్ లేనట్టే.