దుబ్బాక ఉప ఎన్నికల బరువు బాధ్యతలన్నీ తనమీద వేసుకున్న టిఆర్ఎస్ మంత్రి హరీష్ రావు, ఎట్టి పరిస్థితుల్లోనూ తమ అధినేత కేసీఆర్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా, ఇక్కడి ఫలితాలను టిఆర్ఎస్ కు అనుకూలంగా తీసుకువచ్చేందుకు అన్నిరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.ఇది టిఆర్ఎస్ కు మాత్రమే కాకుండా, తన ప్రతిభకు నిదర్శనంగా ఉండబోతున్న నేపథ్యంలో హరీష్ గట్టిగానే కష్టపడుతున్నారు.
ఇక టిఆర్ఎస్ కు పోటీగా కాంగ్రెస్, బీజేపీలు ఇక్కడ గెలుపు కోసం అన్ని రకాల ఎత్తులు వేస్తూ, టిఆర్ఎస్ ను ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి.ఎప్పటికప్పుడు అన్ని రాజకీయ పార్టీల ఎత్తుగడలు మారిపోతూ, ప్రత్యర్థిపై పైచేయి సాధించాలనే గట్టి పట్టుదల వారిలో కనిపిస్తోంది.
ప్రత్యర్థులు ఎన్ని రకాల ఎత్తుగడలు వేసినా,టీఆర్ఎస్ కు అఖండ మెజారిటీ తీసుకురావాలనే ఆకాంక్ష హరీష్ లో గట్టిగానే కనిపిస్తోంది.ఇప్పటికే దుబ్బాకలో అనేక సర్వేలు చేయించగా, టీఆర్ఎస్ గెలుపు సాధ్యమే అయినా, బీజేపీ గట్టిపోటీ ఇస్తుందని, గెలుపు కోసం టిఆర్ఎస్ గట్టిగానే కష్టపడాలనే రిపోర్ట్ రావడంతో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
మెజారిటీ తగ్గినా, అది తమకు ఇబ్బంది ఏర్పడుతుందనే ఉద్దేశంతో, ఇప్పుడు హరీష్ కొత్త ఎత్తులు వేసినట్లు కనిపిస్తుంది.దానిలో భాగంగానే 20 మంది యూత్ తో నాలుగు టీమ్ లను ఏర్పాటు చేసుకుని, ప్రతి మండలంలోనూ నాలుగైదు గ్రామాల్లో పర్యటిస్తూ, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలను పూర్తిగా తెలుసుకుని నివేదిక ఇచ్చే విధంగా హరీష్ ఏర్పాటు చేసుకున్నారు.
అయితే ఇదంతా అత్యంత రహస్యంగా చేయిస్తున్నారట.ఈ సర్వేలో పాల్గొన్న వారంతా పార్టీకి సంబంధం లేని వ్యక్తులు కావడం గమనార్హం.
ఈ ఎత్తుగడ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.ఇప్పటికే దుబ్బాక నియోజక వర్గంలో గెలుపు పై అనుమానం ఉండడంతో, స్వయంగా టిఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ రంగంలోకి దిగి స్వయంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని టిఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇప్పటికే మిగతా పార్టీలు, ఆ పార్టీలో కీలక నాయకులందరినీ నియోజకవర్గంలో మోహరించి, ఎవరికి వారు పై చేయి సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.