పాదయాత్ర చేస్తూ రెండు రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురైన మాజీమంత్రి, హుజురాబాద్ బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్నారు.హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజేందర్ ను అనేకమంది పరామర్శించారు.
అయితే ఇదంతా ఎన్నికలు ఎత్తుగడలో భాగంగానే చేస్తున్నారని, ఇదంతా డ్రామా అంటూ టిఆర్ఎస్ మండిపడుతోంది.తాజాగా తెలంగాణ ఆర్థిక మంత్రి టిఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీష్ రావు ఈటెల వ్యవహారంపై సెటైర్లు వేశారు.బిజెపి అంటే దొంగ డ్రామాల పార్టీ అని విమర్శించారు.గాయాలు అయినట్లు, అనారోగ్యానికి గురైనట్లు, ఒళ్ళంతా పట్టీలు కట్టుకుని ప్రజల్లో తిరుగుతూ, సానుభూతి పొందడం ఆ పార్టీ ప్రచార ప్రణాళికలో భాగం అంటూ హరీష్ మండిపడ్డారు.
త్వరలోనే ఈటెల రాజేందర్ వీల్ చైర్ ద్వారా ప్రజల్లోకి వచ్చి, వారు సానుభూతి పొందేందుకు, వీల్ చైర్ ద్వారానే ప్రజల్లోకి వచ్చి ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నారని కామెంట్స్ చేశారు.ఈ తరహా ఎత్తుగడలు బెంగాల్ తమిళనాడు రాష్ట్రాల్లో చేశారని, కానీ ఆ రాష్ట్రాల్లో ప్రజలు బండకు కొట్టి బీజేపీని తరిమికొట్టారని అన్నారు.
సిద్ధిపేట లో హరీష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఒక్క సంక్షేమ పథకం కూడా లేదని, హుజురాబాద్ లో బిజెపి గెలిచినా ఉపయోగం ఏమీ ఉండదని, ఆ పార్టీ చేసే డ్రామాలు ప్రజల్లోకి తీసుకువెళ్లి ఎండగట్టాలని పార్టీ నాయకులకు హరీష్ సూచించారు.
దళిత బంధు పథకం రాష్ట్రమంతటా అద్భుతంగా అమలు కాబోతోందని, ఈ మేరకు కెసిఆర్ దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టారని, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి టిఆర్ఎస్ ప్రభుత్వం విజయవంతంగా ముందుకు వెళుతోందని హరీష్ చెప్పుకొచ్చారు.టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పటి వరకు 1.32 లక్షల ఉద్యోగాలు కల్పించిందని, త్వరలోనే 70 వేల ఉద్యోగాల భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టిందని హరీష్ తెలిపారు.టిఆర్ఎస్ లో ఈటెల రాజేందర్ కు ఎంతో ప్రాధాన్యం ఉండేదని, కానీ ఆయన తల్లిలాంటి పార్టీకి అన్యాయం చేయడానికి సిద్ధమయ్యారు అంటూ మండిపడ్డారు హరీష్ రావు.