కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా నష్టపోయిన దేశం అమెరికాయే.అగ్రరాజ్యంగా, శక్తివంతమైన దేశంగా, ఆర్ధిక, సైనిక, సాంకేతిక శక్తిలో సాటిలేని పెద్దన్నను కంటిక కనిపించని ఓ చిన్న సూక్ష్మజీవి ముప్పుతిప్పలు పెడుతోంది.ఇప్పటికే అక్కడ 1.32 మిలియన్ల మంది వైరస్ బారినపడగా, 78,200 మంది ప్రాణాలు కోల్పోయారు.ఇది నాణానికి ఓ వైపు మాత్రమే.కరోనా కారణంగా ప్రపంచంలోనే అతిపెద్దదైన అమెరికా ఆర్ధిక వ్యవస్ధ దిగజారిపోతోంది.రోజూ కొన్ని వేలమంది ఉద్యోగాలు పోతున్నాయి.ఏప్రిల్ నెలాఖరు నాటికి ఒక్కసారిగా 14.7 శాతానికి పెరగడంతో ట్రంప్ కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.
దీనిలో భాగంగా అమెరికాలో విదేశీ వృత్తి నిపుణులు పనిచేసేందుకు వీలు కల్పిస్తున్న హెచ్1 బీ వీసాల అనుమతిని తాత్కాలికంగా నిలిపివేసేందుకు యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.
అలాగే చదువుకుంటూ, పనిచేసుకోవడానికి అనుమతి ఉన్న స్టూడెంట్ వీసాలను నిలిపివేసేందుకు ట్రంప్ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లుగా అక్కడి మీడియా కథనాలను ప్రచురిస్తోంది.దీని ప్రకారం వర్క్ బేస్డ్ వీసాల అనుమతిని తాత్కాలికంగా రద్దు చేయనున్నారు.
ముఖ్యంగా హెచ్1బీ, హెచ్2బీ, తదితర వీసాలపై ప్రభావం పడనుంది.
రానున్న కొద్దిరోజుల్లో నిరుద్యోగులుగా మారిన అమెరికన్లకు అవకాశాలు కల్పించడం కోసం విదేశీయులకు వీసాలను రద్దు చేయడం, స్ధానికులకు ఉద్యోగాలు కల్పించే సంస్థలకు ప్రత్యేక రాయితీలు కల్పించడం వంటి నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందని వాల్ స్ట్రీట్ జర్నల్ కథనాన్ని ప్రచురించింది.కాగా కరోనా వైరస్ కారణంగా ఒక్క నెలలోనే 2 కోట్ల మందికిపైగా ఉద్యోగాలు కోల్పోయినట్లు సమాచారం.2008 నాటి ఆర్ధిక మాంద్యం తరువాత అమెరికా సాధించిన ఉపాధి కల్పన, ఉద్యోగ వృద్ధి అంతా ఒక్క నెలలోనే ఆవిరైపోయిందని ఫ్యాక్ట్చెక్ సర్వే పేర్కొంది.ఫెడరల్ ప్రభుత్వం ప్రకటించిన నిరుద్యోగ భృతి కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య 3.3 కోట్లకు పెరిగినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి.
.