కరోనా వైరస్ కారణంగా నెలకొన్న ఆర్ధిక సంక్షభాన్ని తట్టుకోవడానికి, దేశంలో భారీగా పెరుగుతున్న నిరుద్యోగితను అడ్డుకోవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలసలపై కన్నెర్ర చేసిన సంగతి తెలిసిందే.దీనిలో భాగంగా హెచ్ 1 బీ తదితర వీసాలపై ఈ ఏడాది చివరి వరకు ఆయన నిషేధం విధించారు.
ఈ నిర్ణయం భారతీయ ఐటీ రంగంపై పెను ప్రభావం చూపిస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.అయితే ట్రంప్ చర్య వల్ల భారత ఐటీ కంపెనీలపై స్వల్ప స్థాయిలోనే నష్టం జరుగుతుందని దేశీయ రేటింగ్ ఏజెన్సీ క్రిసెల్ తెలిపింది. హెచ్ 1 బీ వీసాల రద్దు వల్ల భారత ఐటీ రంగానికి రూ.1,200 కోట్ల మేర మాత్రమే ప్రభావం పడుతుందని క్రిసెల్ అభిప్రాయపడింది.మన పరిశ్రమ లాభదాయకత 0.25- 0.30 శాతం మేర క్షీణించే అవకాశం ఉందని ఏజెన్సీ పేర్కొంది.ఈ ఏడాది కోవిడ్ 19 కారణంగా భారత ఐటీ కంపెనీల లాభాలకు 23 శాతం గండిపడనుండగా.
హెచ్ 1 బీ వీసాల రద్దు వల్ల కలిగే నష్టాలు దీనికి అదనమని క్రిసిల్ వెల్లడించింది.
మరోవైపు గత కొన్నేళ్లుగా భారతీయ ఐటీ కంపెనీలు అమెరికాలో స్థానికులను రిక్రూట్ చేసుకుంటున్నాయి.ఫలితంగా వీసా సంబంధిత సమస్యల వల్ల కలిగే నష్టాలు మన పరిశ్రమపై పరిమితంగానే ఉండే అవకాశం వుందని క్రిసెల్ పేర్కొంది.అయితే ట్రంప్ నిర్ణయం కారణంగా భారతీయ ఐటీ నిపుణుల్ని అమెరికా తీసుకెళ్లి, అక్కడి తమ యూనిట్లలో పనిచేయించుకునే అవకాశం లేకుండా పోయింది.
అవసరమైన ఉద్యోగుల్ని 25 శాతం అధిక వేతనాలతో స్థానికులతోనే భర్తీ చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది.
కాగా అధ్యయనానికి సంబంధించి క్రిసెల్ టాప్-15 ఐటీ కంపెనీల ప్రదర్శనను పరిగణనలోనికి తీసుకుంది.
ఎంట్రీ సిస్టమ్ స్థాయి ఉద్యోగాలను స్థానికుల ద్వారా భర్తీ చేయడంతో హెచ్ 1 బీ, ఎల్ 1 వీసాలపై అమెరికా తీసుకున్న నిర్ణయం పెద్దగా ప్రభావాన్ని చూపదని తెలిపింది.అలాగే వీసాల రెన్యూవల్పై కూడా ఎలాంటి ప్రభావాన్ని చూపదని క్రిసెల్ వెల్లడించింది.