అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ స్థానిక అమెరికన్లను ప్రసన్నం చేసుకొనేందుకు డొనాల్డ్ ట్రంప్ హెచ్ 1 బీ వీసా నిబంధనల్లో తీసుకొచ్చిన నిబంధనలు విదేశీ వృత్తి నిపుణుల్లో భయాందోళనలు సృష్టిస్తోంది.ట్రంప్ ప్రభుత్వం విధించిన ఆంక్షలతో అమెరికా కంపెనీలకు భారీ నష్టం వాటిల్లనుంది.
ప్రత్యేకించి హెచ్ 1 బి, ఎల్ 1 వీసాల నియంత్రణపై ట్రంప్ వెలువరించిన కార్యనిర్వాహక ఉత్తర్వులతో చివరికి అమెరికానే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ట్రంప్ వేటుతో ఐటి సంస్థలు ప్రత్యేకించి అమెరికా కంపెనీలు దాదాపుగా వంద బిలియన్ డాలర్లు నష్టపోతాయి.
భారతీయ కరెన్సీలో చూస్తే ఈ నష్టం విలువ రూపాయలు 7 లక్షల కోట్లు వరకూ ఉంటుంది.ఈ విషయాన్ని అమెరికాకు చెందిన బ్రూకింగ్స్ ఇనిస్టిట్యూట్ సంస్థ తమ విశ్లేషణల తరువాత వెల్లడించింది.
వీసాల నిలిపివేతలు, పలు రకాల ఆంక్షలతో దాదాపు 2 లక్షల మంది విదేశీ నిపుణులు అమెరికాకు రాకుండా పోతారని హార్వర్డ్ బిజినెస్ స్కూల్కు చెందిన పృథ్వీరాజ్ చౌదరీ, పెన్సిల్వేనియాకు చెందిన డేనీ బహాసర్ తమ నివేదికలో తెలిపారు.
విదేశీ నైపుణ్య వ్యక్తుల ద్వారా కంపెనీల ఆదాయం, ఉత్పాదకత, పెట్టుబడి , సృజనాత్మకత, నూతన ఆవిష్కరణలలో చాలా మెరుగైన ఫలితాలు వస్తూ ఉన్నాయని దీనిని నిరూపించే అంశాలు చాలా ఉన్నాయని నివేదికలో తెలిపారు.
కోవిడ్ తరువాత ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు చేపడుతున్న పలు చర్యలు ఇప్పటి తాజా వీసా ఆంక్షల నిర్ణయాలతో సరైన ఫలితాలను ఇవ్వలేకపోవడంతో పాటు కుంటుపడుతాయని నిపుణులు హెచ్చరించారు.స్కిల్డ్ వర్కర్లను తీసుకుని వివిధ అమెరికన్ కంపెనీలు ఎప్పటికప్పుడు అంతర్జాతీయ స్థాయిలో తమ ప్రాజెక్టులకు మెరుగులు పెట్టుకుంటున్నాయి.
స్వదేశీ ప్రతిభకు పట్టం , ఉద్యోగం అనే నినాదంతో ట్రంప్ తీసుకున్న నిర్ణయం ప్రభావం చివరికి అమెరికా కంపెనీలకు నష్టం కలుగచేస్తాయని వారు హెచ్చరిస్తున్నారు.
హెచ్ 1 బీ వీసాల వడపోతకు సంబంధించి ట్రంప్ ప్రభుత్వం జూన్ 22వ తేదీన కార్యనిర్వాహక ఉత్తర్వులు వెలువరించింది.
దీని కారణంగా హెచ్ 1 బి, ఎల్ 1 వీసాలను డిసెంబర్ 31 వరకూ జారీ చేయకుండా నిషేధించారు.ఈ నిర్ణయం ఫార్చూన్ 500 కంపెనీలపై చూపే ప్రభావం విలువ 100 బిలియన్ డాలర్లు పైబడి ఉంటుందని బ్రూకింగ్స్ తెలిపింది.
వలసల నిరోధం పేరిట ట్రంప్ తీసుకుంటున్న చర్యల ప్రభావంతో విదేశీ నైపుణ్య శక్తిపై ఆధారపడి ఉండే పలు అమెరికా కంపెనీలకు ప్రతికూల పరిస్థితి ఏర్పడుతుందని నివేదికలో హెచ్చరించారు.