కరోనా ప్రభావం ప్రపంచంలోని అన్ని రంగాలపై పడింది.లక్షల కోట్ల ఆదాయాన్ని ఆర్జించే వ్యాపారవేత్తల నుంచి కూలీ పనులు చేసుకునే వారి వరకు నేరుగా కోవిడ్ ఎఫెక్ట్ పడింది.
ఇక బతుకు దెరువు కోసం ప్రపంచంలోని పలు దేశాలకు వలస వెళ్లిన పరిస్ధితి ఇప్పుడు అగమ్య గోచరంగా మారింది.ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి సహా అనేక ఆర్ధిక సంస్థలు ధ్రువీకరిస్తున్నాయి.
దీంతో రానున్న రోజుల్లో లక్షలాది మంది ఉపాధిని కోల్పోయే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇక అగ్రరాజ్యం అమెరికాలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్ధితులు నెలకొన్నాయి.
ప్రధానంగా హెచ్1బీ వీసాదారుల మెడపై కత్తి వేలాడుతున్న చందంగా మారింది.కరోనా కారణంగా ఇప్పటికే అనేక సంస్థలు భారీ నష్టాల్ని ఎదుర్కొంటున్నాయి.
దీని కారణంగా ఆర్ధికంగా మళ్ళీ నిలదొక్కుకునేందుకు ఆయా సంస్థలు రానున్న రోజుల్లో భారీగా ఉద్యోగస్తులను తొలగించే అవకాశం ఉందని ఆర్ధికవేత్తల అంచనా.ఉద్యోగాలు కోల్పోయిన తర్వాత అమెరికాలోనే నివాసం ఉండేందుకు ఉన్న గడువు నిబంధనల్లో సవరణలు చేయాలని హెచ్1 బీ వీసాదారులు ఫెడరల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
అమెరికాలో ఏదైనా కారణం చేత ఉద్యోగం కోల్పోయిన వారు అక్కడ 60 రోజుల వరకు ఉండే అవకాశం ఉంది.అయితే ప్రస్తుత పరిస్ధితుల్లో దీనిని 180 రోజులకు పెంచాలని లక్షలాది మంది హెచ్1 బీ వీసాదారులు వైట్ హౌస్ కు పిటిషన్లు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు.తమను ఆదుకోవాలని ఇప్పటికే పలువురు విదేశీయులు సంతకాల సేకరణ కార్యక్రమానికి పిలుపునిచచ్చారు.ఇప్పటి వరకు దీనిపై 20 వేల మంది సంతకాలు చేశారు.వీరి ఆవేదనను అధ్యక్ష కార్యాలయం పరిగణనలోనికి తీసుకోవాలంటే లక్షమంది సంతకాలు అవసరం.
కాగా హెచ్1బీ వీసాదారుల్లో అత్యధిక మంది భారతీయులే.
వీరిలో చాలా మంది పిల్లలు అమెరికా పౌరులుగా ఉన్నారు.కరోనా కారణంగా భారత్ సహా ఆయా దేశాల్లో కఠినమైన ఆంక్షలు ఉన్న కారణంగా వీరు అక్కడికి వెళ్లడం సాధ్యం కాదు.
మరోవైపు కరోనా కారణంగా గడచిన రెండు వారాల్లో అమెరికాలో లక్షమందికిపైగా ఉపాధి కోల్పోయారు.దీని ప్రభావం హెచ్1బీ వీసాదారులపైనే అధికం.
కొన్ని సంస్థలైతే ఎవరెవరి ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందో ముందుగానే సమాచారం ఇస్తున్నట్లు తెలుస్తోంది.ఓ అంచనా ప్రకారం రాబోయే రోజుల్లో ఒక్క అమెరికాలోనే సుమారు 4.7 కోట్ల మంది ఉపాధి కోల్పోయే అవకాశం ఉందని తేలింది.కాగా జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ సమాచారం ప్రకారం అమెరికాలో గడచిని 24 గంటల్లో 856 మంది కరోనా కారణంగా మరణించడంతో మృతుల సంఖ్య 3,896కి చేరింది.బాధితుల సంఖ్య రెండు లక్షలకు చేరువలో ఉంది.—
.