ఏపీ రాజకీయాలలో మూడో ప్రత్యామ్నాయంగా జనసేన పార్టీతో కలిసి ఎదగాలని బీజేపీ ప్రణాళిక సిద్ధం చేసుకుంటుంది.అయితే ఏపీలో బీజేపీ స్థానం ఏంటి అనేది అందరికి తెలిసిందే.
ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో బీజేపీ పార్టీని ప్రజలు ప్రత్యేకంగా గుర్తించిన పరిస్థితి ఎక్కడా లేదు.ఏదో బలమైన పార్టీతో పొత్తు పెట్టుకుంటే కొన్ని సీట్లు వస్తాయి.
అయితే ఇప్పుడు మాత్రం బీజేపీ ఏపీ రాజకీయాలలో చురుకైన పాత్ర పోషిస్తుంది.ఆ పార్టీలో కీలకమైన నేతలు తన గొంతుని బలంగా ప్రజలలోకి తీసుకెళ్తున్నారు.
అయితే ఇక్కడే అసలు సమస్య వచ్చింది.
ఏపీలో బీజేపీ గొంతు ఎప్పుడు అధికార, ప్రతిపక్ష పార్టీలకి సమదూరంగా ఉంటుంది.
ఈ మధ్య కాలంలో ఏపీ బీజేపీ నేతలు అధికార పార్టీ వైఫల్యాలని ఎత్తి చూపిస్తూ చాలా విషయాలలో విభేదిస్తున్నారు.గత టీడీపీ పాలనని తప్పు పడుతూనే వైసీపీ పరిపాలన అరాచకంగా ఉందని విమర్శలు చేస్తున్నారు.
అయితే ఏపీ బీజేపీ నేతలందరికీ విరుద్ధంగా బీజేపీ ఎంపీ జీవీఎల్ వ్యవహారం ఉంది.ఏపీలో బీజేపీకి తాను సర్వాధికారిగా వ్యవహరిస్తూ అధికార పార్టీ నిర్ణయాలని వ్యతిరేకిస్తున్న బీజేపీ నేతలకి విరుద్ధమైన వ్యాఖ్యలు చేస్తున్నారు.
మూడు రాజధానుల విషయం అయితే జీవీఎల్ వ్యాఖ్యలు ఒకలా ఉంటే మిగిలిన అందరి వాఖ్యలు ఒకలా ఉన్నాయి.మూడు రాజధానులని అడ్డుకోవడానికి ఏపీ బీజేపీ నేతలు కేంద్రంలో ఉన్న బీజేపీని వాడుకొని కొన్ని బాణాలు సందిస్తూ ఉంటే అవి వెళ్ళకముందే జీవీఎల్ గాలి తీసేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో కేంద్రానికి సంబంధం లేదని చెబుతున్నారు.ఇక విశాఖలో చంద్రబాబుపై దాడిని ఆ పార్టీ నేతలు ఖండిస్తే జీవీఎల్ మాత్రం తప్పంతా చంద్రబాబుదే అని వ్యాఖ్యలు చేసారు.
ఆయన పాలనలో అలా చేశారు కాబట్టి ఇప్పుడు ఇలా జరిగింది అంటూ ఒకదానితో ఒకటి ముడులు వేస్తున్నారు.ఇలా జీవీఎల్ వ్యాఖ్యలు, మాటల వలన ఇప్పుడు ఏపీ బీజేపీ నాయకులు బలంగా ఏమీ మాట్లాడలేకపోతున్నారనే వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో వినిపిస్తున్నాయి.