వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం దేశం కానీ దేశంలో స్థిరపడినా మాతృభూమిపై మమకారాన్ని మాత్రం విడిచిపెట్టడం లేదు ప్రవాస భారతీయులు.అక్కడ తాము సంపాదించే ప్రతి రూపాయిలో కొంత భాగాన్ని జన్మభూమి కోసం ఖర్చుపెట్టేవారు ఎంతో మంది వున్నారు.
అంతేకాకుండా గ్రామాలను దత్తత తీసుకోవడం, ఉచిత విద్య, వైద్య సదుపాయాలు, రోడ్లు, మంచినీటి వసతి కల్పించడం వంటి పనులను ఎన్ఆర్ఐలు నిర్వర్తిస్తున్నారు.అయితే గ్రామాల్లో వ్యవసాయం కోసం రైతులు పడుతున్న బాధల్ని గమనించిన ఓ ప్రవాస భారతీయుడు సుమారు 6000 చెరువులను నిర్మించి అన్నదాతకు చేయూతనిందించాడు.
అక్కడితో ఆగకుండా దీనిని మరిన్ని గ్రామాలకు విస్తరించేందుకు గాను త్వరలో 1,00,000 చెరువుల్ని నిర్మించాలని సంకల్పించారు.ఇందుకోసం రూ.800 కోట్లు ఖర్చవుతుందని అంచనా.
ఆ అపర భగీరథుడి పేరు గురురాజ్ దేశ్ పాండే.
భారతీయ అమెరికన్ పారిశ్రామికవేత్త అయిన ఆయన.సైకామోర్ నెట్వర్క్స్కు సహ వ్యవస్థాపకుడు.మసాచుసెట్స్లోని చెమ్స్ఫోర్డ్లో ఆయన ఇంటర్నెట్ పరికరాలు తయారు చేసే సంస్థకు అధిపతి.ఎంఐటీలో దేశ్పాండే సెంటర్ ఫర్ టెక్నలాజికల్ ఇన్నోవేషన్, దేశ్పౌండే ఫౌండేషన్లను ఆయన స్థాపించారు.
కర్ణాటక రాష్ట్రంలోని హుబ్లీకి చెందిన గురురాజ్ దేశ్పాండే.తండ్రి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి.మద్రాస్ ఐఐటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో బీటెక్ చేసిన గురురాజ్.అనంతరం కెనడాలోని న్యూబ్రూన్స్విక్ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు.తర్వాత కెనడాలోని ఒంటారియోలోని క్వీన్స్ యూనివర్సిటీ నుంచి అప్లైడ్ సైన్స్ , డేటా కమ్యూనికేషన్స్లో పీహెచ్డీ చేశారు.1980లలో కెనడా టెలికమ్యూనికేషణ్ దిగ్గజం మోటరోలా అనుబంధ సంస్థ కోడెక్స్ కార్పోరేషన్లో దేశ్పాండే తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు.తదనంతర కాలంలో గురురాజ్ రౌటర్లను తయారు చేసే కోరల్ నెట్వర్క్కు సహ వ్యవస్థాపకుడిగా వ్యవహరించారు.ఈ సంస్థను సన్ఆప్టిక్స్కు 15 మిలియన్ డాలర్లకు విక్రయించారు.అయితే 1993లో ఈ డీల్ జరగడాని కంటే ముందే గురురాజ్ కోరల్ నెట్వర్క్స్ను విడిచిపెట్టారు.
1990లో కాస్కేడ్ కమ్యూనికేషన్కు సహ వ్యవస్థాపకుడిగా వున్న ఆయన.1997లో దీనిని 3.7 బిలియన్ డాలర్లకు అస్సెండ్ కమ్యూనికేషన్స్కు విక్రయించారు.1998లో సైకామోర్ నెట్వర్క్ను ప్రారంభించేందుకు గాను ఎంఐటీ పరిశోధకులతో కలిసి పనిచేశారు దేశ్పాండే.ఒక ఏడాది కాలంలోనే సైకామోర్ 18 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్కు పెరిగింది.
ఈ సంస్థలో గురురాజ్ 21 శాతం వాటాను కలిగివున్నారు.ఈ ఐపీఓ ద్వారా దేశ్పాండే ప్రపంచంలోని సంపన్న వ్యాపారవేత్తల్లో ఒకరిగా చేసింది.
ఫోర్బ్స్ 400 లిస్ట్లో అత్యంత ధనవంతుడైన అమెరికాలో గురురాజ్ స్థానం సంపాదించారు.జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదిగిన ఆయన జన్మభూమి కోసం ఏదైనా చేయాలనే ఉద్దేశ్యంతో తన భార్య జైశ్రీతో కలిసి 1995లో దేశ్పాండే ఫౌండేషన్ను స్థాపించారు.
దీని ద్వారా భారతదేశంలో వ్యవసాయాన్ని మెరుగుపరచడంతో పాటు రైతులకు చేయూతనందించాలని ఈ దంపతులు నిర్ణయించారు.2013లో చెరువుల నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఈ ఫౌండేషన్.మనదేశంలో సుమారు 6,000 చెరువులను నిర్మించింది.ఒక చెరువు నిర్మించేందుకు రూ.80,000 ఖర్చవుతుంది.చెరువుల నిర్మాణం వల్ల రైతులు రెండు పంటలు వేయడానికి అవకాశం కలిగి వారి ఆదాయం రెట్టింపవుతుందని గురురాజ్ ఆలోచన.
ఈ కార్యక్రమం చూసిన బాలీవుడ్ సూపర్స్టార్ అమీర్ ఖాన్, ఆయన భార్య కిరణ్ రావ్, ఎన్ఆర్ఐ సత్యజిత్ భక్తల్ తదితరులు చెరువుల నిర్మాణంలో భాగస్వాములయ్యారు.అలాగే ఔత్సాహిక పారిశ్రామివేత్తలను ప్రోత్సహించేందుకు గాను దేశ్పాండే సెంటర్ ఫర్ సోషల్ ఎంటర్ప్రెన్యూయర్షిప్ కార్యక్రమానికి గురురాజ్ రూపకల్పన చేశారు.