అమెరికాలో విషాదం చోటు చేసుకుంది.గుంటూరు జిల్లాకు చెందిన తెలుగు దంపతులు సరస్సు దాటుతూ గల్లంతయ్యారు.
అధికారుల రెస్క్యూ ఆపరేషన్లో భార్య మృతదేహం లభించగా.భర్త కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పాలపర్రు గ్రామానికి చెందినప ముద్దన నారాయణ, హరిత దంపతులు అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో నివసిస్తున్నారు.
వీరిద్దరూ అక్కడే ఉద్యోగం చేస్తున్నారు.ఈ క్రమంలో సోమవారం ఫినిక్స్ ప్రాంతంలో విహార యాత్రకు వెళ్లారు.
మంచు తుఫాన్ కారణంగా వీరు పిక్నిక్ వెళ్లిన ప్రాంతంలోని సరస్సు గడ్డకట్టుకుపోయింది.అయితే దీనిపై నిలబడి ఫోటోలు దిగుతూ ముందుకు సాగుతుండగా మంచు కుంగిపోయింది.
దీంతో నారాయణ, హరిత దంపతులు సరస్సులోని మంచులో కూరుకుపోయారు.అయితే పిల్లలు ఐస్లేక్ ఒడ్డునే వుండటంతో వారు అరుపులు, కేకలు పెట్టారు.వెంటనే రంగంలోకి దిగిన సహాయక బృందాలు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించాయి.ఇప్పటి వరకు హరిత మృతదేహం లభించగా… సీపీఆర్ చేసి ఆమెను రక్షించేందుకు సహాయక సిబ్బంది ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.
అయితే నారాయణ ఆచూకీ తెలియకపోవడంతో ఆయన కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.ఈ విషయం తెలుసుకున్న పాలపర్రులోని నారాయణ తల్లిదండ్రులు, బంధుమిత్రులు విషాదంలో కూరుకుపోయారు.
ఈ ఏడాది జూన్లో నారాయణ దంపతులు చివరిసారిగా పాలపర్రు వచ్చి… కొద్దిరోజుల పాటు బంధుమిత్రులతో సంతోషంగా గడిపి అమెరికా వెళ్లారని .అంతలోనే ఈ ప్రమాదం జరిగిందని వారు వాపోతున్నారు.ఇకపోతే.బాంబ్ సైక్లోన్ కారణంగా అమెరికా, కెనడాలు వణికిపోతున్నాయి.ఉష్ణోగ్రత మైనస్ 40 డిగ్రీలకు పడిపోవడంతో జనం బయట కాలు పెట్టాలంటేనే భయపడిపోతున్నారు.రోడ్లు, రైలు మార్గాలపై అడుగుల మందాన మంచు పేరుకుపోవడంతో అధికారులు, సిబ్బంది రాకపోకలను పునరుద్దరించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
అటు దాదాపు 16 వేల విమాన సర్వీసులు సైతం రద్దయ్యాయి.పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు.