గుజరాత్ రాష్ట్రంలో వడోదర తో పాటు మరో 6 మునిసిపల్ కార్పొరేషన్లకు ఫిబ్రవరి 21వ తేదీన ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రతిపక్ష, అధికార పార్టీ నేతలు జోరుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.ఈ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ మరియు ఫలితాలు ఫిబ్రవరి 23వ తేదీన వెల్లడించనున్నారు.
మిగతా మునిసిపల్, పంచాయతీ ఎన్నికలు ఫిబ్రవరి 28వ తేదీన జరుగనున్నాయి.ఈ క్రమంలోనే ఆదివారం నాడు గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ వడోదర లోని నిజాంపుర లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ మహాసభ లో పాల్గొన్నారు.
అయితే విజయ్ రూపాని ఈ సభలో ప్రసంగిస్తున్న సమయంలో ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురై కిందపడిపోయారు.వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ గార్డులు విజయ్ రూపనీ పూర్తిగా కింద పడిపోకుండా పట్టుకున్నారు.
అలాగే అక్కడే ఉన్న వైద్య సిబ్బంది ఆయనకు వెంటనే ప్రథమ చికిత్స అందించారు.అనంతరం ముఖ్యమంత్రి విజయ్ రూపానీ స్టేజి మెట్లు తనంతటతానే దిగారు.ఆ తర్వాత ఆయనను హెలికాప్టర్ లో అహ్మదాబాద్ లోని ఓ ఆస్పత్రికి తరలించారు.అలాగే ముఖ్యమంత్రి తదుపరి పాల్గొన వలసిన అన్ని ర్యాలీ లను రద్దు చేశారు.
ఆదివారం రోజు ఆయన వడోదర లో ఏకంగా మూడు ర్యాలీలలో పాల్గొన్నారు.గత రెండు రోజులుగా ఆరోగ్యం బాగో లేకపోయినా విజయ్ రూపనీ విశ్రాంతి లేకుండా నిర్విరామంగా ఎర్రటి ఎండలో ర్యాలీ లో పాల్గొంటున్నారు.
జామ్ నగర్ లో శనివారం రోజు, వడోదర లో ఆదివారం రోజు ఆయన ర్యాలీలో పాల్గొన్నారు.ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్యం బాగా క్షీణించడం తో పాటు బిపి, షుగర్ లెవెల్స్ దారుణంగా పడిపోయాయి.ఈ కారణంగానే 64 ఏళ్ళ విజయ్ రూపనీ తూలి పడ్డారని వైద్యులు చెబుతున్నారు.ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్న ముఖ్యమంత్రి ఆరోగ్యం నిలకడగానే ఉందని యుఎన్ మెహెత ఆసుపత్రి వర్గాల నుంచి సమాచారం అందుతోంది.
అయితే ప్రధానమంత్రి నరేంద్రమోడీ విజయ్ రూపనీ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.