సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిపోతున్నారు ఏపీ సీఎం జగన్.వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ, దేశవ్యాప్తంగా ఆయన వార్తల్లో నిలుస్తున్నారు.
కొద్ది రోజుల క్రితం సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ రమణకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి జగన్ లేఖ రాయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.సాక్షాత్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి పైనే జగన్ ఆరోపణలు చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ఈ వ్యవహారంలో ఖచ్చితంగా జగన్ ఇబ్బందులకు గురవడం తప్పదనే సంకేతాలు ఇప్పుడు పెద్దఎత్తున వస్తున్నాయి.ఇప్పటికే జగన్ ను సీఎం పదవి నుంచి తప్పించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.
తాజాగా ఆయన పిటిషన్ పై దేశవ్యాప్తంగా చర్చ జరగడంతో పాటు, ఢిల్లీలోనూ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.ఇప్పటికే రిటైర్డ్ న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు మహిళా న్యాయవాదుల అసోసియేషన్ జగన్ తీరుపై మండిపడ్డారు.
న్యాయవ్యవస్థ ను చులకన చేసే విధంగా జగన్ వ్యవహరిస్తున్నాడు అంటూ, ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు మాజీ న్యాయమూర్తులు సైతం అభ్యంతరాలు వ్యక్తం చేశారు.ఇది ఆషామాషీ వ్యవహారం కాదని, ఇప్పటికే జగన్ పై 31 కేసులు పెండింగ్ లో ఉన్నాయని, ఆ తీర్పులు చెప్పే న్యాయమూర్తులపై ఈ లేఖ ప్రభావం పడే అవకాశం ఉందంటూ సందేహాలు వ్యక్తం చేశారు.
ఇప్పటికే సుప్రీం కోర్టు లాయర్ అశ్విని సీజే కు లేఖ రాశారు.
న్యాయవ్యవస్థకు ఎటువంటి భంగం వాటిల్లకుండా, తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఏపీ హైకోర్టు, సుప్రీం కోర్టు న్యాయమూర్తులపై పథకం ప్రకారమే ఈ విధంగా ఆరోపణలు చేస్తున్నారని, ఇప్పటికే ప్రజాప్రతినిధులపై కేసులను త్వరగా పరిష్కరించాలని తీర్పు ఇచ్చిన జస్టిస్ రమణ పై జగన్ ఆగ్రహంగా ఉన్నారని లాయర్ అశ్విని లేఖలో పేర్కొన్నారు.మరోవైపు సుప్రీంకోర్టు మహిళా న్యాయవాదులు అసోసియేషన్ సైతం జగన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఉద్దేశపూర్వకంగానే జస్టిస్ రమణ పై జగన్ ఆరోపణలు చేస్తున్నారంటూ వారు పేర్కొంటున్నారు.
ఇక ఎప్పుడూ వైసీపీ పై విమర్శలు చేసేందుకు సిద్ధంగా ఉండే నరసాపురం వైసిపి రెబెల్ ఎంపీ సైతం ఈ వ్యవహారంలో జగన్ కు చిక్కులు తప్పవని చెబుతున్నారు.అయితే ఈ వ్యవహారంలో కేంద్రం జోక్యం కూడా తప్పనిసరి కావడంతో, ఢిల్లీ బీజేపీ పెద్దలకు ఇది పెద్ద తలనొప్పిగా మారింది.
ఈ విషయం లో ఏ విధంగా ముందుకు వెళ్ళినా, తమకు చిక్కులు తప్పవని బీజేపీ అగ్రనేతలు అభిప్రాయపడుతున్నారట.