తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ పైకి మేడిపండులా కనిపిస్తున్నా లోపల మాత్రం ఎన్నో ఎన్నెన్నో అంతర్యుద్ధాలు ఆ పార్టీలో చోటు చేసుకుంటున్నాయి.ముఖ్యంగా ఆ పార్టీలో నాయకుల మధ్య ఆధిపత్య పోరు తీవ్ర స్థాయిలో పెరిగిపోయింది.
ఈ గ్రూపు తగాదాలు ముదిరి ఎక్కడికి దారితీస్తోయో తెలియక ఆ పార్టీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు.ఇప్పటివరకు కేసీఆర్ ఆధ్వర్యంలో నడిచిన పార్టీ ఇప్పుడు ఆయన కుమారుడు కేటీఆర్ ఆధీనంలోకి వెళ్లడంతో ఈ గ్రూపుల గోల ఎక్కువయ్యింది అనే టాక్ వినిపిస్తోంది.
యువకుడు, పెద్దగా అనుభవం లేకపోవడంతో పార్టీలో ఉన్న సీనియర్ నాయకులతో ఏ విధంగా వ్యవహరించాలో తెలియక కేటీఆర్ ఇబ్బందులు పడుతున్నారని పార్టీలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
ఇదే సరైన అవకాశంగా భావించి కొంతమంది గ్రూపు రాజకీయాలకు తెరతీసినట్టు సమాచారం.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయాన్ని సాధించిన టీఆర్ఎస్ పార్టీలోకి ఇతర పార్టీలకు చెందిన నాయకులు పెద్ద ఎత్తున వచ్చి చేరడం, అప్పటికే టీడీపీ, కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లు కొందరు టీఆర్ఎస్ లో ఉండడంతో ఆ పార్టీల నుంచి వచ్చిన నాయకులు వీరితో జత కలిసి గ్రూపులు కడుతున్నట్టు తెలుస్తోంది.ప్రస్తుతం టీఆర్ఎస్ లో తెలుగుదేశం గ్రూపు, కాంగ్రెస్ గ్రూపు, టిఆర్ఎస్ గ్రూపు, సీనియర్ల గ్రూపు అంటూ పార్టీలో కొందరు గ్రూపులుగా విడిపోయి రాజకీయాలు చేస్తున్నారట.
మంత్రివర్గ విస్తరణ సమయంలో పార్టీలో సీనియర్లను పక్కన పెట్టడంతో వారి అనుచరులు ఆగ్రహంగా ఉండడమే కాకుండా వారంతా కలిసి ఓ గ్రూపుగా ఏర్పడినట్లు పార్టీలో కొంతమంది నాయకులు చెవులు కొరుక్కుంటున్నారు.కొత్తగా తెలుగుదేశం పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన శాసనసభ్యులు, సీనియర్ నాయకులు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు.భవిష్యత్తులో జరిగే మంత్రివర్గ విస్తరణతో పాటు కార్పొరేషన్ పదవులు, ఇతర పదవులలో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం దక్కుతుందేమో అన్న సందేహం టీఆర్ఎస్ లో ముందు నుంచి ఉన్న నాయకుల్లో వ్యక్తం అవుతోంది.ఇక పార్టీ సీనియర్లు కొంతమంది గ్రూపులు కట్టడంతో వారిని ఎలా దారికి తెచ్చుకోవాలో తెలియక కేటీఆర్ సతమతం అవుతున్నట్టు కేసీఆర్ కూడా గుర్తించారట.
అయితే లోక్ సభ ఎన్నికల ఫలితాల అనంతరం ఈ వ్యవహారాన్ని ఒక గాడిలో పెట్టాలని కేసీఆర్ చూస్తున్నాడట.