హెచ్ 1 బీ వీసా జారీ ప్రక్రియలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలను వాయిదా వేసిన జో బైడెన్.పాత లాటరీ పద్ధతిలోనే వీసాలు ఇస్తామని ప్రకటించారు.
దీంతో విదేశీయులు.ముఖ్యంగా భారతీయుల ఆనందం మాటల్లో చెప్పలేనిది.
ఈ ప్రకటన వెలువడిన వెంటనే హెచ్ 1 బీ వీసాలకు దరఖాస్తు పెట్టుకోవాలని లక్షలాది మంది రెడీ అవుతున్నారు.ఈ క్రమంలో తోటి భారతీయులకు షాకిచ్చింది అమెరికాలోని ఓ భారత సంతతి సంస్థ.
ఇండియన్స్కి కొత్తగా హెచ్ 1 బీ వీసాలు జారీ చేయొద్దంటూ ఇమ్మిగ్రేషన్ అడ్వొకసి గ్రూప్ బైడెన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.ఈ సంస్థ ఆందోళనకు ఓ కారణం వుంది.
ఇప్పటికే గ్రీన్కార్డుల విషయమై దేశాలవారీ పరిమితి (కంట్రీ-క్యాప్)పై సందిగ్ధత నెలకొందని, అది తొలిగిపోయే వరకు భారతీయులకు హెచ్-1 బీ వీసాలు ఇవ్వొద్దని పేర్కొంది.ఇప్పటికే గ్రీన్కార్డుల కోసం ఎదురుచూస్తున్న భారతీయుల సంఖ్య భారీగా ఉన్నందున.
మళ్లీ కొత్తగా వీసాలు జారీ చేస్తే సుమారు 60 వేల మంది ఇండియన్స్కి హెచ్ 1 బీ వీసాలు వస్తాయని అడ్వొకసి తెలిపింది.అదే జరిగితే గ్రీన్కార్డుల సమస్య మరింత జఠిలం అవుతుందని ఈ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.
కాగా, హెచ్-1బీ వీసాల ఎంపిక ప్రక్రియలో ట్రంప్ తీసుకొచ్చిన నూతన నిబంధనలను డిసెంబర్ 31 వరకు వాయిదా వేస్తూ బైడెన్ యంత్రాంగం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.హెచ్-1బీ వీసాల జారీలో దశాబ్ధాలుగా అమలు చేస్తున్న కంప్యూటరైజ్డ్ లాటరీ పద్ధతికి స్వస్తి పలుకుతూ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక సంస్కరణలు తీసుకొచ్చారు.గరిష్ఠ వేతన స్థాయి, నైపుణ్యం ఆధారంగా వీసాలు ఇచ్చేలా కీలక సవరణ చేశారు.దీనికి అనుగుణంగా హెచ్-1 బీ ఎంపికలో లాటరీ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ (యూఎస్సీఐసీ) జనవరి 7న తుది ప్రకటన కూడా చేసింది.
దీని ప్రకారం మార్చి 9 నుంచి కొత్త ఎంపిక విధానం అమల్లోకి రావాల్సి ఉంది.
అయితే కొత్త విధానానికి అనుగుణంగా హెచ్-1బీ రిజిస్ట్రేషన్ వ్యవస్థ, ఎంపిక ప్రక్రియలో మార్పులు చేయాల్సి ఉన్నందున కాస్త సమయం పట్టే అవకాశం వుంది.అందువల్ల నూతన విధానాన్ని డిసెంబరు 31 వరకు వాయిదా వేస్తున్నట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ ఓ ప్రకటనలో తెలిపింది.అప్పటివరకు పాత లాటరీ విధానాన్నే కొనసాగించనున్నట్లు వెల్లడించింది.
మరోవైపు బైడెన్ పాలనా యంత్రాంగం తీసుకున్న నిర్ణయంతో ఈ ఏడాది 60 వేల మంది భారతీయులు వీసాల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశముందని ఇమ్మిగ్రేషన్ వాయిస్ సంస్థ ప్రెసిడెంట్ అమన్ కపూర్ తెలిపారు.ప్రతిభలేని ఉద్యోగులు, వలసవాదుల వీసాల ప్రాసెసింగ్తో ఇమ్మిగ్రేషన్ న్యాయవాదులతో పాటు మరికొందరు మాత్రమే బైడెన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో లాభపడతారని ఆయన పేర్కొన్నారు.
కనుక గ్రీన్కార్డులపై దేశాలవారీగా ఉన్న పరిమితి తొలిగిపోయే వరకు భారతీయులకు కొత్తగా వీసాలు జారీ చేయకపోవడం మంచిదని అమన్ కపూర్ అభిప్రాయపడ్డారు.ఒకవేళ మళ్లీ కొత్తగా వీసాలు ఇస్తే.
ఇప్పటికే గ్రీన్కార్డుల కోసం చాలాకాలంగా వేచి చూస్తున్న భారతీయులు మరింత కాలం వెనకబడిపోతారని అమన్ ఆందోళన వ్యక్తం చేశారు.