జనసేన పార్టీ రాజకీయంగా యాక్టీవ్ అయ్యింది.ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, పార్టీ ని పరుగులు పెట్టించే పనికి శ్రీకారం చుట్టారు .
వరుసగా అనేక ప్రజా సమస్యలపై గళం ఎత్తుతూ, జనాల్లో జనసేన పై చర్చ జరిగేలా చేస్తున్నారు.ప్రస్తుతం వైసీపీ పై పెరుగుతున్న వ్యతిరేకత , పడిపోతున్న టీడీపీ గ్రాఫ్ ఇవన్నీ జనసేనకు బాగా కలిసొస్తుందని, ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన ప్రభావం బాగానే కనిపించింది ఆ పార్టీ ఖుషీగా ఉన్నారు.
ఈ పరిణామాలన్నింటినీ ఉపయోగించుకుని రాజకీయంగా చక్రం తిప్పేందుకు జనసేన పార్టీ సిద్ధమైంది. ఈ మేరకు నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహిస్తూ జనాల్లో చర్చ జరిగేలా చేస్తున్నారు.
తాజాగా అమలాపురం నియోజకవర్గ సమావేశంలో సాక్షాత్తు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమక్షంలోనే పార్టీ నేతల మధ్య విభేదాలు తలెత్తాయి.నాదెండ్ల మనోహర్ పాల్గొన్న ఈ సమావేశం ఇందుపల్లి ఏ కన్వెన్షన్ హాల్ లో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి శెట్టి బత్తుల రాజబాబు అధ్యక్షతన జరిగింది.
ఈ కార్యకర్తల సమావేశంలో నాదెండ్ల మనోహర్ సైతం పాల్గొన్నారు ఈ సమావేశం ముగిసిన అనంతరం మనోహర్ బయటకు వెళుతున్న సమయంలో హాలు బయట ఒక్కసారిగా రెండు వర్గాల మధ్య విభేదాలు బయటపడ్డాయి.ముఖ్యంగా సమపన , ఈదరపల్లి గ్రామాలకు చెందిన ఇద్దరు కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది.
ఇది మరింత తీవ్రతరమై రెండు వర్గాలు బాహాబాహీకి దిగడం, కేకలు అరుపులతో ఆ ప్రాంతం లో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
రాజబాబుకు నియోజకవర్గం లోని కొంతమంది పార్టీ నాయకులకు మధ్య ఇటీవల కొంత విభేదాలు వచ్చాయి .దీంతో రెండు వర్గాలుగా పార్టీ చీలింది.మాజీ మున్సిపల్ చైర్మన్ టిడిపి నాయకులు సతీష్ ఆ పార్టీ కి రాజీనామా చేసి జనసేన చేరేందుకు ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆయనను రాజబాబు వర్గం అడ్డుకుంటూ వస్తున్నట్లు సతీష్ వర్గం ఆరోపిస్తోంది.ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాలకు మధ్య నాదెండ్ల మనోహర్ సమక్షంలోనే విభేదాలు బయటపడడం పార్టీలో కలవరం పుట్టించింది.