ఏపీ అధికార పార్టీ వైసీపీలో నాయకుల మధ్య విభేదాలు రచ్చ రచ్చ గా మారాయి.మొన్నటి వరకు నాయకుల మధ్య విభేదాలు అంతర్గతంగా ఉన్నట్టుగా కనిపించినా, ఇప్పుడు మీదికెక్కి మరి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి వైసీపీలో నెలకొంది.
ఏపీ వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ ఇదే రకమైన పరిస్థితి ఉంది.నియోజకవర్గ స్థాయి నాయకులకు , ఎమ్మెల్యేలకు ఎంపీలు, ఎమ్మెల్యేలకు, మంత్రులు ఎమ్మెల్యేలకు ఇలా కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు గ్రూపు తగాదాలు ముదిరిపోయాయి.
ఎప్పటి నుంచో ఈ తరహా వ్యవహారాలు చోటుచేసుకుంటున్న, పార్టీ తీవ్రంగా నష్టపోతున్న, జగన్ మాత్రం ఎప్పటికప్పుడు సదరు నాయకులకు పార్టీ ఇంచార్జి ల ద్వారా వార్నింగ్ ఇప్పిస్తున్నారు.అయితే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు విషయానికి వచ్చేసరికి ఏ మాత్రం అవి పనిచేయడం లేదు.
నేరుగా జగన్ నాయకులను పిలిచి గ్రూపు రాజకీయాలకు పాల్పడకుండా చెక్ పెట్టగలిగితే పరిస్థితుల్లో మార్పు వస్తుంది తప్ప, మిగతా ఎవరితో వార్నింగులు ఇప్పించినా, ఫలితం ఉండదు అనేది విశ్లేషకుల అభిప్రాయం.
ప్రస్తుతం ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల్లో విజయం తో వైసీపీ లో మంచి హుషారు కనిపిస్తున్నా, నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలు 2024 ఎన్నికల్లో వైసీపీ విజయావకాశాలను దెబ్బ తీస్తాయి అనే ఆందోళన పార్టీ నాయకుల్లో నెలకొంది.
రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మధ్య వివాదం ముదిరిపోతుంది.ఒకరి నియోజకవర్గాలు మరొకరు వేలు పెడుతున్నారు అనే కారణాలతో ఒకరిపై ఒకరు విమర్శలకు దిగిన పరిస్థితి ఇక్కడ నెలకొంది.
వైసీపీ అధికారంలోకి వచ్చిన మొదట్లో ఎమ్మెల్యే రాజా, ఎంపీ భారత్ మధ్య విబేధాలు ఉన్నా, ఆ తర్వాత అనేక వ్యవహారాలు వీరిద్దరి మధ్య దూరం పెంచాయి.ఓ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భరత్ అవమానించే విధంగా జక్కంపూడి వర్గీయులు వ్యవహరించడం , దీనికి కౌంటర్ గా రాజా కు సంబంధించిన ఫ్లెక్సీలను భరత్ వర్గం వారు చించి చేయడం ఎలా అనేక సంఘటనలు చోటు చేసుకోవడంతో వీరి మధ్య దూరం పెరుగుతూ వస్తోంది.
ఈ వ్యవహారంపై అధిష్టానం వరకు ఫిర్యాదు వెళ్లడంతో ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య ఎటువంటి వివాదం లేకుండా చేసేందుకు పార్టీ ఇన్చార్జి వై.వి.సుబ్బారెడ్డి రంగంలోకి దిగినా, కొంతకాలం సద్దుమణిగినట్టు వ్యవహారం కనిపించింది.మళ్లీ ఇప్పుడు ఒకరిపై ఒకరు బహిరంగంగా విమర్శలు చేసుకోవడం తో రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గంలో నెలకొన్న గ్రూపు రాజకీయాలు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది.
స్వయంగా జగన్ రంగంలోకి దిగి ఎమ్మెల్యేలు, ఎంపీలు మంత్రులతో ఈ వ్యవహారాలపై చర్చించి గ్రూపు రాజకీయాలకు చెక్ పెట్టే విధంగా వ్యవహరించకపోతే పార్టీ మరిన్ని ఇబ్బందులకు గురికాక తప్పదు.