ఎంతో ఉత్కంఠ రేపిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ముగిశాయి.టీఆర్ఎస్కు గత ఎన్నికల్లో ఏకంగా 99 సీట్లు రాగా ఈ సారి 120 వస్తాయని బీరాలు పోయింది.
అయితే గ్రేటర్ ఓటరు కారుకు పంక్చర్ వేసి ఆ పార్టీని కేవలం 58 సీట్లకు సరిపెట్టేశారు.ఆ తర్వాత బీజేపీకి 46 సీట్లు చివరకు ఎంఐఎంకు 44 డివిజన్లు వచ్చాయి.
మిగిలిన 2 డివిజన్లు కాంగ్రెస్ గెలిచింది.గ్రేటర్ పీఠం దక్కించుకోవాలంటే ఏ పార్టీకి అయినా 75కు పైగా డివిజన్లు రావాలి.
అయితే అక్కడ ఉన్న ఎక్స్ అఫీషియో ఓట్లు కూడా కలిపితే గ్రేటర్లో మొత్తం 206 ఓట్లు ఉన్నట్టు లెక్క.
అంటే 103 ఓట్లు వచ్చిన పార్టీకే గ్రేటర్ పీఠం దక్కుతుంది.
అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే ఏ పార్టీకి కూడా పొత్తులు లేకుండా గ్రేటర్ మేయర్ పీఠం దక్కే పరిస్థితి లేదు.ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ ఎంఐఎం, టీఆర్ఎస్తో కలవదు.
ఆ పార్టీ సిద్ధాంతాలు ఈ రెండు పార్టీలకు వ్యతిరేకం.ఇక ఎంఐఎం + టీఆర్ఎస్ కలిస్తే ఆ కూటమికే మేయర్ పీఠం దక్కుతుంది.
నిజానికి ఎన్నికలకు ముందు నుంచే ఈ రెండు పార్టీలు కలుస్తాయన్న టాక్ ఉంది.
బీజేపీ కూడా ఆ ప్రచారం చేయడంతో ఏకంగా 46 సీట్లు గెలుచుకుంది.ఇప్పుడు ఈ రెండు పార్టీలు కలిస్తే భవిష్యత్తులో కూడా ఈ రెండు పార్టీలు ఒక్కటే అన్న ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళుతుంది.అది రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్కు గట్టి ఎదురు దెబ్బ అవుతుంది.
అందుకే బీజేపీ పుణ్యమా అని రెండుపార్టీలు కలిసే పరిస్ధితి లేకుండా పోయింది.ఎంఐఎం ఇప్పుడు టీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తే ఓల్డ్ సిటీలో బీజేపీకి ప్లస్ అవుతుంది.
ఇక ఫిబ్రవరిలో కొలువుదీరే కొత్త పాలకవర్గాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారో ? కూడా తెలియని పరిస్థితి.మేయర్ పీఠం దక్కించుకునేందుకు ఎవ్వరికి సరైన బలం లేకపోతే స్పెషల్ ఆఫీసర్ పాలన పెట్టడం లేదా మళ్లీ ఎన్నికలకు వెళ్లడం ఈ రెండు మార్గాలే ఉన్నాయి.