కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పౌరసత్వ బిల్లు లోక్ సభ లో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే.దీనిని విపక్షాలు ఎంతగా వ్యతిరేకించిన కూడా బీజేపీ ప్రభుత్వం తన మాట నెగ్గించుకుంది.
వారి నిరసనలు అసలు లెక్కచేయకుండా తనకున్న బలంతో మరోసారి చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని పౌరసత్వ బిల్లు ఆమోదించింది.ఇదిలా ఉంటే ఈ బిల్లు ఆమోదం తెలిపిన వెంటనే ఈశాన్య రాష్ట్రాలలో నిరసనలు మొదలయ్యాయి.
ఆందోళన కారులు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి విద్వంసం సృష్టిస్తున్నారు.ఇక వీరిని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం పారామిలటరీ బలగాలని రంగంలోకి దించింది.
ఆంక్షలు విధించింది.అయిన కూడా ఆంక్షలు లెక్కచేయకుండా ఆందోళన కారులు రోడ్ల మీదకి వస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ నిరసనల నేపథ్యంలోనే కేంద్ర సమాచార, ప్రసార శాఖ ప్రైవేటు శాటిలైట్ టీవీ చానళ్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది.హింసను ప్రేరేపించేలా, దేశ వ్యతిరేక వైఖరిని ప్రోత్సహించేలా, దేశ సమగ్రతను దెబ్బతీసేలా ఉన్న దృశ్యాలను ప్రసారం చేయవద్దని హెచ్చరించింది.
ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతున్న ఘర్షణల దృశ్యాలను కొన్ని టీవీ చానళ్లు ప్రసారం చేయడంతో సమాచార, ప్రసార శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.హింసను ప్రేరేపించే అంశాలను ప్రసారం చేయకుండా అన్ని చానళ్లు అప్రమత్తతో ఉండాలని, దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని మంత్రిత్వ శాఖ కోరింది.
హింసాత్మక దృశ్యాలు ప్రసారం చేసినట్లయితే తరువాత కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించింది.ఈ నేపధ్యంలో ప్రసార మాధ్యమాలు చాలా వరకు ఈ ఈశాన్య రాష్ట్రం నిరసనలని తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నాయి.