ఏపీ సీఎంగా జగన్ పరిపాలన మొదలైనప్పటి నుంచి ఎన్నో సంచలన నిర్ణయాలకు , ఎన్నో వివాదాలకు ఆయన కేంద్రబిందువుగా మారిపోయారు.పరిపాలన సంస్కరణల పేరుతో జగన్ తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదమవుతూనే వస్తున్నాయి.
ఇక రాజకీయ ప్రత్యర్థుల ఈ విషయంలో జగన్ అనుసరిస్తున్న వైఖరి వివాదాస్పదంగా మారుతోంది.గత టిడిపి ప్రభుత్వం లో ఎంతోమంది మంత్రులు , ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడ్డారని అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ విమర్శలు చేసింది.
దీనికి సంబంధించిన ఎన్నో ఆధారాలను సేకరించి పెట్టుకుంది.వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టిడిపి నేతలను టార్గెట్ చేసుకుంటూ వారి వ్యవహారాలను బయటకు లాగుతూ అరెస్టులు చేయిస్తూ జైలుపాలు చేస్తున్నారు.
అయితే ఆయా కేసుల్లో అరెస్టు అవుతున్న నేతలు వైసిపి అనుకున్నట్లుగా శిక్షలు అనుభవిస్తున్నారా అంటే లేదనే చెప్పాలి. జైలుపాలైన, కేసుల్లో ఇరుక్కున్న వారు కోర్టులో ఊరట పొందుతున్నారు.
వెంటనే బెయిల్ పై బయటకు వచ్చి వైసీపీ కి సవాల్ విసురుతున్నారు.కొన్ని కేసుల్లో కోర్టులను సైతం తప్పుపడుతూ వైసీపీ ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తున్న తీరు చాలా సందర్భాల్లో కనిపించింది.
ఈ కేసుల్లో ప్రభుత్వం కు ఎదురు దెబ్బలు తగలడానికి కారణం సరైన న్యాయ నిపుణులు పార్టీలో లేకపోవడం, అలాగే ప్రత్యర్థులపై పెడుతున్న కేసులు, సెక్షన్లు బలహీనంగా ఉండడం, సరైన ఆధారాలు పూర్తిస్థాయిలో సేకరించకపోవడం, కోర్టులో ఇబ్బందులు ఏర్పడకుండా ముందుగానే అన్ని జాగ్రత్తలు తీసుకోకపోవడం, ఇలా ఎన్నో అంశాలు వైసీపీ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారడమే కాకుండా కోర్టుల వద్ద అవమానపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చాలా కేసుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగానే తీర్పులు వచ్చాయి.అలాగే జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అమరావతి ప్రాజెక్టు విషయంలో కోర్టు చిక్కులు ఏర్పడ్డాయి .ఇటీవల టిడిపి కీలక నాయకులు దూళిపాళ్ల నరేంద్ర కు చెందిన సంఘం డైరీ ని ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు ఇచ్చిన జీవో ను సైతం కోర్టు తప్పుబట్టింది.అలాగే గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కు చెందిన అమర్ రాజా బ్యాటరీ కంపెనీ విషయంలోనూ, గొట్టిపాటి రవికుమార్ కు చెందిన మైనింగ్ కంపెనీ విషయంలోనూ వైసీపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బలు తగిలాయి.జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అమరావతి విషయంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.