తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల యజమానులు ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నారు.నిబంధనలకు విరుద్ధంగా పెట్రోల్ అమ్మకాలు సాగిస్తున్నారు.
నిపుణుల సూచనలతో ప్రభుత్వం విధించిన నిబంధనలను కూడా తుంగలో తొక్కుతున్నారు.బంక్ యజమానుల నిర్లక్ష్య ధోరణి కూడా పరోక్షంగా నేరగాళ్లకు ఉపయోగపడుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి… డబ్బాలు, బాటిళ్లలో పెట్రోల్ కొనుగోలు చేసే వారిలో కొందరు తమ నేరాల కోసం దానిని వాడుకుంటున్నట్టు పలు ఘటనల్లో స్పష్టమైంది.
దాంతో, డబ్బాలు, బాటిళ్లతో వచ్చేవారికి పెట్రోల్ అమ్మడంపై ప్రభుత్వం నిషేధం విధించింది.
అది తెలిసినా బంకుల యజమానులు మాత్రం డబ్బులు దండుకోవడమే ధ్యేయంగా నిబంధనలకు నీళ్లొదులుతున్నారు.
నిబంధనలు పాటించకపోతే నేరగాళ్లు తాము కొనుగోలు చేసిన పెట్రోల్ ను తాము చేసిన ఘోరాల్ని కప్పి పుచ్చుకునేందుకు ఎలా ఉపయోగిస్తారో పలు సంఘటనల్లో రుజువైంది.అందుకు ఓ ఉదాహరణ.
దిశపై జరిగిన సామూహిక అత్యాచారం కేసు .అత్యాచారం అనంతరం దిశను హత్యగావించిన నేరగాళ్లు ఆనవాళ్లు దొరక్కుండా చేయడానికి ఆమె శవాన్ని పెట్రోల్ పోసి తగులబెట్టిన ఉదంతం తెలిసిందే.అది మరిచిపోకముందే తాజాగా జరిగిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం మరో ఉదాహరణ.
ఈ రెండు ఘటనలను దృష్టిలో ఉంచుకొనైనా ప్రభుత్వం, సంబంధిత అధికారులు నిబంధనలను అమలు చేసేలా బంకుల యజమానులపై ఒత్తిడి తేవాల్సి ఉంది.పెట్రోల్ అక్రమ అమ్మకాల వెనుక యజమానుల పాత్ర ఎంత.? సిబ్బంది పాత్ర ఎంత అన్నది తేలాలన్నా సంబంధిత అధికారుల పర్యవేక్షణ సక్రమంగా ఉన్నప్పుడే తేలుతుంది.నేరాలు చేసేవాళ్లు చేస్తుంటారు.వాటికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించేవాళ్లు కూడా ఉంటారు.పరోక్షంగా సహకరించేవాళ్లకు కొన్ని సార్లు తాము చేసే అక్రమాలు నేరగాళ్లకు ఉపయోగపడుతున్నాయన్న సోయి కూడా ఉండకపోవచ్చు.వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకొని నిబంధనల అమలయ్యేలా ప్రభుత్వమే కఠిన చర్యలు చేపట్టాలి.