ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్కు కొద్దివారాల ముందు ఫ్రాన్స్ భారీ జరిమానా విధించిన సంగతి తెలిసిందే.అంతా ఇంత కాదు ఏకంగా 268 మిలియన్ డాలర్లు.
గూగుల్కు ఫ్రాన్స్కు చెందిన యాంటీ కాంపిటిషన్ వాచ్ డాగ్ సంస్థ 268 మిలియన్ డాలర్ల జరిమానా విధించింది.ఆన్లైన్ ప్రకటనల విషయంలో నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ జరిమానా విధించింది.
ఆన్లైన్ అడ్వర్టైజింగ్ వ్యాపారంలో తన ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేసినందుకు ఈ జరిమానా విధిస్తున్నట్లు తెలిపింది.కొన్ని మొబైల్ సైట్లు, యాప్లలో గూగుల్ తమ పోటీదారుల ప్రకటనలకు సంబంధించి ఆంక్షలు విధించిందని సదరు వాచ్డాగ్ సంస్థ విచారణలో తేలింది.
తాజాగా గూగుల్ అమెరికాలో త్వరలో మరో న్యాయ విచారణను ఎదుర్కోనుంది.తన మొబైల్ యాప్ స్టోర్ను నడపటంలో గూగుల్ యాంటీట్రస్ట్ చట్టాన్ని ఉల్లంఘించిందని ఆరోపిస్తూ పలు రాష్ట్రాల అటార్నీ జనరల్ల బృందం జూన్ చివరి వారంలో దావా వేసేందుకు సిద్ధమవుతున్నారు.
గూగుల్ ప్లే స్టోర్లో అండ్రాయిడ్ డివైస్ నిర్వహణకు సంబంధించి యాప్ డెవలపర్స్ నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి.దీంతో గతేడాదిలోనే దావా వేసేందుకు అటార్నీలు సిద్ధమయ్యారు.కానీ పలు కారణాల వల్ల ఇది వాయిదా పడుతూ వచ్చింది.
ఉటా, టెన్నెసి, నార్త్ కరోలినా, న్యూయార్క్ రాష్ట్రాలకు చెందిన అటార్నీ జనరల్లు గూగుల్పై విచారణకు నేతృత్వం వహిస్తున్నారు.
అయితే రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం వుంది.సంబంధిత కేసులు విచారిస్తున్న నార్త్ కాలిఫోర్నియాలోని ఫెడరల్ కోర్టులోనే ఈ కేసు నమోదయ్యే అవకాశం వుందని సమాచారం.
ప్రముఖ వీడియో గేమ్ మేకింగ్ కంపెనీ ‘‘ఎపిక్ గేమ్స్’’ గతేడాది గూగుల్పై దావా వేసింది.దీనిపై 2022లో విచారణ జరిగే అవకాశం వుంది.అంతేకాదు ఒకే ధర్మాసనం ముందు ప్లే స్టోర్పై రెండు ప్రతిపాదిత క్లాస్ యాక్షన్ వ్యాజ్యాలు కూడా వున్నాయి.రాష్ట్రాలు ప్రీ ట్రయల్స్ కార్యకలాపాల్లో పాల్గొనాలనుకుంటే వారు వీలైనంత త్వరగా పిటిషన్ దాఖలు చేయాల్సి వుంటుంది.
గత నెలతో విచారణ ముగిసిన తర్వాత ఆపిల్, ఎపిక్లు కాలిఫోర్నియా పిటిషన్పై తీర్పు కోసం ఎదురుచూస్తున్నాయి.కాగా, గూగుల్ తొలుత ఆపిల్ కన్నా మిన్నగా యాప్ స్టోర్ను నడపడంలో భాగంగా ఓపెన్గా వుంచింది.
అయితే ఇటీవల ప్లే స్టోర్ నిబంధనలను కఠినతరం చేసింది.
అయితే ఇంత జరుగుతున్నా ఫెడరల్ యాంట్రీ ట్రస్ట్ ఎన్ఫోర్స్మెంట్ ఏం చేస్తోందన్న చర్చ జరుగుతోంది.ఈ నేపథ్యంలోనే గూగుల్పై దావా వేసేందుకు రాష్ట్రాల అటార్నీలు సిద్ధమవ్వడం అనుమానాలకు తావిస్తోంది.సెనేట్ జ్యూడీషియరీ కమిటీ యాంట్రీ ట్రస్ట్ ప్యానెల్కు అధ్యక్షత వహించే సెనేటర్ అమీ క్లోబుచార్తో సహా మరింత మంది గూగుల్పై కఠిన చర్యల కోసం ఒత్తిడి చేస్తున్నారు.
గూగుల్ ఇప్పటికే గతేడాది న్యాయ శాఖ వేసిన ఫెడరల్ దావాను ఎదుర్కొంది.దీనితో పాటు అటార్నీ జనరల్ సహా రెండు వేర్వేరు గ్రూపులు దాఖలు చేసిన యాంటీ ట్రస్ట్ కేసులను సైతం ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.