జార్జ్ ఫ్లాయిడ్ హత్యతో అమెరికన్ సమాజంలోని జాతి వివక్ష వ్యవహారం మరోసారి బయటపడింది.ఇన్నాళ్లు శ్వేతజాతి దురహంకారాన్ని భరించిన నల్లజాతీయులు ఈసారి మాత్రం దీనిని వదలిపెట్టే సూచనలు కనిపించడం లేదు.
కరోనా వంటి క్లిష్ట పరిస్ధితుల్లోనూ న్యాయం చేయాలంటూ రోడ్డెక్కి ప్రభుత్వాన్ని వణికిస్తున్నారు.వీరి పోరాటానికి అమెరికన్ సమాజంతో పాటు ప్రపంచవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు మద్ధతు పలుకుతున్నారు.
ఈ నేపథ్యంలో టెక్ దిగ్గజం గూగుల్కు సీఈవోగా వ్యవహరిస్తున్న భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. జాత్యహంకారం, వర్ణ వివక్షలపై పోరాడేందుకు గాను గూగుల్ తరపున 37 మిలియన్ డాలర్ల భారీ విరాళం ప్రకటించారు.
ఇప్పటికే జార్జ్ ఫ్లాయిడ్ హత్యను ఖండించిన ఆయన నల్లజాతీయులకు అండగా నిలబడాలని నిర్ణయించుకున్నారు.అంతేకాకుండా ప్రాణాలు కోల్పోయిన నల్లజాతీయులకు గౌరవ సూచికంగా 8 నిమిషాల 46 సెకన్ల పాటు మౌనం పాటించాలని గూగుల్, ఆల్పాబెట్ ఉద్యోగులకు సంయుక్తంగా పంపిన ఈ మెయిల్లో సుందర్ పేర్కొన్నారు.
నల్లజాతి సమాజం బాధపడుతోంది, మనలో చాలా మంది మనం నమ్మేవాటి కోసం నిలబడటానికి మార్గాలు వెతుకుతున్నామన్నారు.తాను కొంతమంది నల్లజాతీ నాయకులతో మాట్లాడనని, ఈ పోరాటంలో తమ కంపెనీ తరపున ఎలా సహకరించగలమనే దానిపై చర్చించామనీ సుందర్ పిచాయ్ ఉద్యోగులకు చెప్పారు.జాతి సమానత్వం కోసం పనిచేసే సంస్థలకు గూగుల్ 12 మిలియన్ డాలర్లు ఇస్తుందని, జాతి వివక్ష సమాచారాన్ని అందించే సంస్థలకు యాడ్ గ్రాంట్లలో 25 మిలియన్ డాలర్ల నిధులను ఇస్తుందని సుందర్ పిచాయ్ స్పష్టం చేశారు.దీనిలో మొదటి గ్రాంట్గా ఒక మిలియన్ డాలర్లు చొప్పున సెంటర్ ఫర్ పోలీసింగ్ ఈక్విటీ, ఈక్వల్ జస్టిస్ ఇనిషియేటివ్ సంస్థలకు అందిస్తామని గూగుల్ సీఈవో పేర్కొన్నారు.
అలాగే వారికి కావాల్సిన సాంకేతిక సాయాన్ని అందిస్తామని ఆయన ప్రకటించారు.
కాగా జార్జ్ ఫ్లాయిడ్ హత్యలో మిగిలిన నలుగురు పోలీసు అధికారులను న్యాయస్థానం దోషులుగా గుర్తించింది.
ఆయన హత్యకు కారణమైన డెరెక్ చావిన్పై మాత్రమే ఇప్పటి వరకు థర్డ్ డిగ్రీ మర్డర్ కేసు నమోదు చేశారు.అయితే ఈ కేసులో నలుగురు అధికారులకు శిక్ష పడాల్సిందేనని ఫ్లాయిడ్ కుటుంబంతో పాటు నల్లజాతీ సమాజం మొత్తం డిమాండ్ చేస్తోంది.