గత కొన్ని రోజులు వర్షాలు హైదరాబాద్ ను తడిపి ముద్ద చేస్తున్నాయి.ఇక తాజాగా కురుస్తున్న వానల దెబ్బకి హైదరాబాద్ మహానగరం చెరువుని తలపిస్తుంది.
ఎక్కడిక్కడ చెరువులు నిండిపోయి , రోడ్లపైకి నీళ్లు వచ్చేస్తున్నాయి.అలాగే పలు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమైయ్యాయి.
భారీ వర్షాలకు ఇప్పటికే నగరంలో 24 మంది మరణించారు.పలు ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.
వరదలో చిక్కుకున్న పలువురిని బోట్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
ఈ సమయంలో హైదరాబాద్ ను వాయుగుండం దాటేసిందంటూ వాతావరణ శాఖ వెల్లడించింది.
దాదాపు 30 ఏళ్ల తరువాత హైదరాబాద్ మీదుగా ప్రయాణించిన వాయుగుండం కర్ణాటకకు చేరడంతో మరో పెద్ద గండం తప్పింది.ఇక , వాయుగుండం రాష్ట్రాన్ని దాటడంతో గ్రేటర్ లో ఇక భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని తెలిపారు.
అయితే దీని ప్రభావంతో రాగల మరో నాలుగు రోజులు తేలికపాటి వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ వివరించింది.
మరోవైపు వాయుగుండం ప్రభావంతో గురువారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
మంగళవారం వర్షాలకు హైదరాబాద్ నగరం తడిసి ముద్దయింది.భారీ వర్షానికి పోటెత్తిన వరద ఉధృతి ఇంకా తగ్గలేదు.
ఇక బుధవారం రాత్రి నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.