తెలంగాణాలో కొలువుల జాతర మొదలైంది అనే ప్రచారం ఊపందుకుంటున్న సమయంలో టీఆర్ఎస్ సర్కార్ మరో తీపికబురు చెప్పేందుకు సిద్దం అవుతుందట.
ఈసారి కేసీయార్ చూపు ప్రభుత్వ ఉద్యోగుల వైపు మళ్లినట్లుగా ఉంది.
వారి పై ప్రేమతో కావచ్చూ, లేదా మరోసారి అధికారం తమకే దక్కాలనే ఆలోచనతో కావచ్చూ మొత్తానికి ఉద్యోగులు ఇన్నాళ్ల నుండి ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ఫిట్ మెంట్పై త్వరలో ప్రకటన చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందట.
ఇకపోతే దుబ్బాకలో జరిగిన ఎన్నికల్లో కమళం దెబ్బకు ఖంగుతిన్న కారు.
ఆ బాధను జీహెచ్ఎంసీ ఎన్నికల విజయంతో మరచిపోదాం అనుకుందట.కానీ ఈ ఎన్నికల్లో కూడా కారుకు పడ్డ బ్రేకులు మొరాయించడంతో స్వల్ప ఆధిక్యంతో సరిపెట్టుకుంది.
తమ పాలన తాబేలులా ఇలాగే సాగితే రానున్న రోజుల్లో గులాభి వాడిపోయి నాయకుల ఒంటి మీద కండువలా మిగిలిపోతుందని భావించిన ఆ పార్టీ అధినేత కేసీయార్, నిరుద్యోగులను, వివిధ వర్గాల ఉద్యోగులను ఆకట్టుకునేలా ప్రణాళికలు రచిస్తున్నారట.
ఇందులో భాగంగానే ప్రభుత్వ ఉద్యోగులకు 30 శాతం వరకు ఫిట్మెంట్ ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
కాగా ఇది ఎప్పటి నుంచి అమలు చేస్తారని అంశంపై సర్కార్ ఇంకా తుది నిర్ణయానికి రాలేదట.ఏది ఏమైనా త్వరలోనే కేసీయార్ ఓ తీపి కబురు అందిస్తారని ప్రభుత్వ ఉద్యోగులు ఆశిస్తున్నారట.