భారతదేశంలో పెట్రోల్, డీజిల్ వాహనాల వల్ల పెరిగిపోతున్న కాలుష్యానికి కళ్లెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం వీలైనన్ని ప్రయత్నాలు చేస్తోంది.ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు దారులకు ప్రోత్సాహకాలు ప్రకటిస్తోంది.
అంతే కాదు ప్రతి ఒక్కరు కూడా ఎలక్ట్రిక్ వాహనాలనే వాడే విధంగా ఛార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.ఈవీ ఛార్జింగ్ కేంద్రాలు తక్కువగా ఉంటాయనే భావనతో చాలామంది ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపడం లేదు.
అయితే ఈ సమస్యను పరిష్కరించేందుకు పలు సంస్థలు ముందుకు వస్తున్నాయి.ఏపీ కొత్త & పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ నెడ్క్యాప్ (NREDCAP) కూడా ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది.
ఈ నేపథ్యంలో తాజాగా ఏపీ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడానికి టైరెక్స్, స్టాటిక్ అనే సంస్థలు ఒప్పుకున్నాయి.వచ్చే ఏడాది జనవరి నాటికి ఈ రెండు సంస్థలు కనీసం 100 కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.
నెడ్క్యాప్ సంస్థ ప్రధాన నగరాల్లో ప్రతి మూడు కిలోమీటర్లకు ఒక ఎలక్ట్రిక్ ఛార్జింగ్ సెంటర్ తీసుకురావాలని నిర్ణయించింది.తక్కువ బ్యాటరీ సామర్థ్యం గల ద్విచక్ర ఎలక్ట్రిక్ వాహనాల ధర రూ.60లోపే ఉంటోంది.దాంతో వీటి డిమాండ్ పెరుగుతుందని.
తద్వారా ఛార్జింగ్ కేంద్రాలు ఎక్కువగా ఏర్పాటు చేయాల్సిన అవసరం వస్తుందని నెడ్క్యాప్ భావిస్తోంది.అయితే ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసుకున్న వారికి ఇది ఒక మంచి శుభవార్తగా చెప్పుకోవచ్చు.
ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం ఫాస్ట్ ఛార్జింగ్ ఫెసిలిటీ తీసుకొచ్చేందుకు కృషి చేస్తోంది.దాంతో గంటల తరబడి ఎలక్ట్రిక్ వాహనాలను ఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు.అలాగే దేశవ్యాప్తంగా 22 వేల ఎలక్ట్రిక్ ఛార్జింగ్ కేంద్రాలను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్చలు జరుపుతోంది.ప్రధాన నగరాల్లో మూడు కిలోమీటర్ల పరిధిలో స్టేషన్లను ఏర్పాటు చేస్తే.హైవేలపై 25 కిలోమీటర్ల పరిధిలో ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రచిస్తోంది.ఈ స్థాయిలో ప్రజలందరికీ ఛార్జింగ్ కేంద్రాలు అందుబాటులోకి వస్తే రోడ్లపై అన్ని ఎలక్ట్రిక్ వాహనాలే కనిపిస్తాయని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.