పుష్కరాల్లో పుణ్య స్నానాలు చేసి ఎంతో కొంత పుణ్యం సంపాదించుకోవాలని వెళితే అక్కడ జరిగిన తొక్కిసలాటలో పదకొండు మంది ప్రాణాలు కోల్పోయారు.పుష్కరాల ప్రారంభ దినమైన మంగళవారం నాడే ఈ దుర్ఘటన ఆంధ్రాలోని రాజమండ్రిలో జరిగింది.
ఏ విషయంలోనైనా ‘మొదటి రోజు’కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు.ఇదో సెంటిమెంట్.
దీంతో పుష్కరాల ప్రారంభం రోజే వేలాది మంది ఎగబడ్డారు.దీంతో తొక్కిసలాట జరిగి పదకొండుమంది మృత్యువాత పడ్డారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం వీరిలో ముగ్గురు మహిళలు ఉన్నారు.మొదటి రోజు తీవ్రమైన ప్రాణ నష్టం జరగడంపై ఏపీ ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు.
పరిస్థితిని సమీక్షించారు.ఈ దుర్ఘటన ప్రతిపక్షాలకు ఆయుధమే కదా….! పుష్కరాలకు సరైన ఏర్పాట్లు చేయలేదని, సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరించిందని అపోజిషన్ పార్టీలు మండిపడ్డాయి.ఘాట్ల దగ్గర భద్రతా ఏర్పాట్లు చేయలేదని వైకాపా నాయకుడు జ్యోతుల నెహ్రూ విమర్శించారు.
ఈ దుర్ఘటనకు ప్రభుత్వం ఏ అధికారులను ‘బలి’ చేస్తుందో.నిజానికి అధికారులు ఎన్ని ఏర్పాట్లు చేసినా జనంలో క్రమశిక్షణ లేకపోతే ఇలాంటి దుర్ఘటనలకు అవకాశం ఉంటుంది.‘పదండి ముందుకు…పదండి తోసుకు’ అన్నట్లుగా జనం వేలం వెర్రిగా పరుగులు తీస్తే తొక్కిసలాట జరుగుతుంది.ప్రస్తుత ఘటనలో ఏం జరిగిందో పూర్తిగా తెలియదు.
తప్పు ఎవరిదైనా పుష్కరాలు మృత్యు ఘోషతో ప్రారంభం కావడం దురదృష్టకరం.