కరోనా వైరస్ ప్రజలను ఎన్ని ఇబ్బందులకు గురి చేస్తుందో మాటల్లో చెప్పలేము.ఒక పక్క కరోనా వైరస్ కి వాక్సిన్ వచ్చిందని సంతోషపడాలో లేక వాక్సిన్ వేయించుకున్నాక కూడా ఈ మహమ్మారి మళ్ళీ తన కోరలు విసురుతోందని భయపడాలో అర్ధం కానీ పరిస్థితులలో ప్రజలు ఉన్నారనే చెప్పాలి.
ఇప్పుడు మరోసారి కరీంనగర్ లో కరోనా తన పంజా విసురుతుంది.జిల్లా వ్యాప్తంగా కొత్తగా 26 కరోనా కేసులు నమోదయ్యాయి.
రామగుండం ఎన్టీపీసీ లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్ కు,అలాగే గోదావరి ఖని బ్లడ్ బ్యాంకులో పనిచేస్తున్న ఉద్యోగికి, అతని భార్యకు కూడా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.విచిత్రం ఏంటంటే ఇప్పుడు పాజిటివ్ వచ్చిన అందరు కూడా ఆల్రెడీ వాక్సిన్ వేయించుకున్న వాళ్లే అవ్వడం గమనార్హం.
గోదావరి ఖని ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేసే ఉద్యోగి రెండు సార్లు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నా కరోనా పాజిటివ్ వచ్చింది.దీనితో వైద్యులు షాక్ అయ్యారు.అలాగే వాసన కోల్పోవడంతో బ్లడ్ బ్లాంక్ ఉద్యోగికి అనుమానం వచ్చి కరోనా పరీక్షలు చేయించుకున్నాడు.ఇతను కూడా గత నెల 18న కరోనా వ్యాక్సిన్ వేయించుకోగా, రెండో డోస్ ఈ నెల 18న వేసుకున్నాడు.
మరోవైపు బ్యాంకు మేనేజర్ కు కరోనా సోకడంతో సంబంధిత అధికారులు బ్యాంకును మూసేసారు.
దీనితో ఆ బ్యాంకు సిబ్బంది, అలాగే బ్యాంకు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేవారు కూడా కరోనా భయంతో భయపడుతున్నారు.
అయితే కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.వాక్సిన్ వేయించుకున్నా సరే మాస్కులు ధరించి, సామజిక భౌతిక దూరం పాటించాలని హెచ్చరిస్తున్నారు.శానిటైజర్స్ రాసుకుంటూ చాలా జాగ్రత్తలు వహించాలని సూచించారు.ఇప్పటికే కరోనా కొత్త రూపంలో అందరిని వణికిస్తోంది.
అందుకనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటు వైద్యులు ఇటు ప్రభుత్వం హెచ్చరిస్తున్నారు.