ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం కారణంగా భూగోళం వేడెక్కడంతో పాటు పర్యావరణ సమతుల్యం దెబ్బతింటున్న సంగతి తెలిసిందే.దీని కారణంగా అనేక విపత్తులు చోటు చేసుకుంటున్నాయి.
దీని ప్రభావం గడిచిన రెండేళ్లుగా అన్ని దేశాల్లోనూ కనిపిస్తోంది. కుండపోత వర్షాలు, 50 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు, వేడి గాలులతో చాలా దేశాలు ఇబ్బందులను ఎదుర్కొన్నాయి.
ఈ నేపథ్యంలో అన్ని దేశాలు వాతావరణ కాలుష్యంపై దృష్టి సారించాయి.దీనిలో భాగంగా గ్లాస్గోలో జరుగుతున్న కాప్ 26 సదస్సుకు దాదాపు 200 దేశాల నేతలు, ప్రతినిధులు హాజరయ్యారు.
సోమ, మంగళవారాల్లో జరిగే ప్రారంభ సదస్సుల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటారు.వాతావరణానికి హాని కలిగిస్తున్న గ్రీన్హౌస్ ఉద్గారాలను తగ్గించేందుకు చేపట్టబోయే కసరత్తు గురించి దేశాధినేతలు చర్చిస్తారు.
తాజాగా వాతావరణ సదస్సు లాంఛనంగా ప్రారంభమైనట్లు కాప్ 26 అధ్యక్షుడు, భారత సంతతికి చెందిన బ్రిటన్ మంత్రి ఆలోక్ శర్మ ప్రకటించారు.అంతకుముందు.గడిచిన ఏడాదిన్నరగా కొవిడ్-19తో ప్రాణాలు కోల్పోయినవారికి నివాళులర్పించేందుకు.ప్రతినిధులు ఒక నిమిషం పాటు మౌనం పాటించారు.
అనంతరం ఆలోక్ శర్మ మాట్లాడుతూ.పారిశ్రామికీకరణకు ముందు నాటితో పోలిస్తే భూతాపంలో పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్కు మించనివ్వకుండా చూడాలన్న లక్ష్యాన్ని సాధించేందుకు ఈ సదస్సే ‘చివరి అత్యుత్తమ ఆశ’ అని అన్నారు.ఈ లక్ష్యాన్ని సజీవంగా ఉంచుకునేందుకు సమయం మించిపోతోందని ఆయన వెల్లడించారు.
“చర్చలను మనం ముందుకు నడిపించాలని.వచ్చే పదేళ్లకాలం ఆకాంక్షలు, చర్యలతో సాగేలా చూడాలని ఆలోక్ శర్మ అన్నారు.హరిత వ్యవస్థ వృద్ధిలో అపారంగా ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి” అని ఆయన దేశాధినేతలను కోరారు.ప్రపంచంలోనే అతిపెద్ద కాలుష్య కారక దేశంగా ఉన్న చైనా.తన వాతావరణ లక్ష్యాలను కొంత మేర పెంచిందని శర్మ ప్రశంసించారు.అయితే డ్రాగన్ నుంచి ఇంకా ఎక్కువ ఆశించామని వ్యాఖ్యానించారు.
అంతకుముందు కాప్ 26 సదస్సు ప్రారంభానికి ముందు ఆలోక్ శర్మ మీడియాతో మాట్లాడుతూ.సోమ, మంగళవారాలో జరగనున్న ఈ శిఖరాగ్ర సదస్సుకు దేశాధినేతలు తరలివచ్చి భూగోళం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.మానవాళికి ముఖ్యమైన ఈ సమస్యపై ఏకమవుదామన్నారు.
కాప్ 26:
వాతావరణ మార్పులను నియంత్రించేందుకు గాను 1992లో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఒక ఒప్పందం కుదిరింది.దానిపై సంతకాలు చేసిన దేశాల సమావేశాన్ని ‘కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (కాప్)’గా వ్యవహరిస్తున్నారు.1995లో కాప్ తొలి సమావేశం జరిగింది.ఆరేళ్ల క్రితం 2015 పారిస్లో జరిగిన సమావేశంలో ఓ కీలక ఒప్పందానికి ఆయా దేశాలు అంగీకరించాయి.ఈ భేటీ జరగడం ఇది 26వ సారి.ఆదివారం నుంచి నవంబరు 12 వరకు జరిగే ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు ఇప్పటికే… 25,000 మందికి పైగా ప్రతినిధులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.ఈసారి జరిగే కాప్ 26 భేటీకి బ్రిటిష్ కేబినెట్ మంత్రి అలోక్ శర్మ నేతృత్వం వహిస్తున్నారు.