ప్రస్తుతం దుబ్బాక ఎన్నికల తంతు ఈ రోజుతో ముగియనుంది. ఇప్పటి వరకూ ఇక్కడ ఎన్నికల పైన దృష్టి సారించిన టిఆర్ఎస్ ఇక నుంచి పూర్తి స్థాయిలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై దృష్టి పెట్టబోతోంది.
దుబ్బాక తో పాటు, జిహెచ్ఎంసి ఎన్నికల్లో తమ సత్తా చాటుకుని, ప్రతిపక్షాలకు ధీటుగా సమాధానం చెప్పాలని, ఆ పార్టీ ని కోలుకోని విధంగా దెబ్బతీయాలి అనే వ్యూహంతో టిఆర్ఎస్ ముందుకు వెళ్తుంది.ముఖ్యంగా గ్రేటర్ బాధ్యతలు మొత్తం మంత్రి , టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చూస్తున్నారు .ఆయనే గ్రేటర్ గెలుపు ఓటములకు బాధ్యత వహించబోతున్నారు.ఈ ఎన్నికల ఫలితాల అనంతరం కేటీఆర్ సీఎం కుర్చీలో కూర్చునే అవకాశం ఉండడంతో, ఈ ఎన్నికలను ప్రతిష్టాతకంగా తీసుకున్నారు.
మొన్నటి వరకు గెలుపు పై ధీమాతో ఉన్న టిఆర్ఎస్ కు, వరదల కారణంగా ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందని, ముందు నుంచి ఊహిస్తున్నంత స్థాయిలో గ్రేటర్ ఎన్నికల్లో విజయం సాధ్యం కాదని, గట్టిగానే కష్టపడాలని అభిప్రాయానికి టిఆర్ఎస్ పెద్దలు వచ్చేసారు. దీనికితోడు ఇప్పటికే నిర్వహించిన వివిధ సర్వేల్లో , గెలుపు అంత సులువు కాదు అనే సంకేతాలు రావడం, ఇవన్నీ లెక్కలు వేసుకుంటున్న కేటీఆర్ కార్పొరేటర్లలో చాలామందికి ఈ సారి టికెట్ ఇవ్వకూడదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
సగం మందికి పైగా కొత్తవారిని ఎంపిక చేసి, వారికి టికెట్లు కేటాయించడం ద్వారా, వ్యతిరేకతను తగ్గించుకోవాలని చూస్తుండటంతో, ప్రస్తుత కార్పొరేటర్ల లో చాలా ఉంది ఆందోళన చెందుతున్నారు.ఇప్పటి వరకు తమకు టికెట్ తప్పకుండా వస్తుందని అభిప్రాయంతోనే , భారీగా సొమ్ము ఖర్చు పెడుతూ వస్తున్నామని, కానీ, ఇప్పుడు టికెట్ ఇస్తారా లేదా అనే టెన్షన్ మొదలవడంతో మరింత ఆందోళన చెందుతున్నారు.
ప్రస్తుతం జిహెచ్ఎంసి పరిధిలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఓటర్ల జాబితా ఆధారంగా 150 డివిజన్ల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేసే పనిలో ఎన్నికల అధికారులు నిమగ్నమయ్యారు.
ఈనెల 7వ తేదీన ముసాయిదాను ప్రచురించబోతున్నట్లుగా ఎన్నికల సంఘం ప్రకటించింది.
అలాగే ఈనెల 13వ తేదీలోగా ముసాయిదా జాబితాను విడుదల చేసి, అభ్యంతరాలు స్వీకరించి తుది జాబితాను విడుదల చేస్తామని అధికారులు ప్రకటించారు.ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకారం చూస్తే, మరో రెండు నెలల్లో ఎన్నికల తంతు మొదలయ్యే అవకాశం ఉండడంతో, అటు పార్టీల్లోనూ, ఇటు టిఆర్ఎస్ టిక్కెట్ ఆశిస్తున్న అభ్యర్థుల్లోనూ టెన్షన్ మొదలైపోయింది.