తెలంగాణలో ఇటీవల దుబ్బాక నియోజకవర్గంలో జరిగిన బైపోల్లో బీజేపీ అభ్యర్థి రఘునందనరావు తెరాస అభ్యర్థిపై విజయం సాధించడంతో టీఆర్ఎస్ పార్టీ తన ఫోకస్ మొత్తం జీహెచ్ఎంసీ 2020 ఎన్నికలపై పెట్టింది.ఎట్టి పరిస్థితుల్లో బల్దియాలో తమ జెండా ఎగరాల్సిందేనన్న సంకల్పంతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నీ తానై ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
అయితే తెరాసను ఢీకొట్టేందుకు, దుబ్బాక విజయాన్ని మార్పుగా చూపిస్తూ, జాతీయ నేతలతో ప్రచారం నిర్వహించింది కమలం దండు.ఇక డిసెంబర్ 1న జరిగిన GHMC ఎన్నికల్లో కేవలం 46.6 శాతం మాత్రమే ఓటింగ్ నమోదయ్యింది.ఇంత తక్కువ ఓటింగ్ శాతం నమోదవడంతో అన్ని పార్టీలు ఆందోళనకు గురవుతున్నాయి.
GHMC ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారా అనే అంశం ప్రస్తుతం సర్వత్రా ఆసక్తిగా మారింది.ఇక తాజాగా ఈ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి.GHMC ఎన్నికల్లో తక్కువ శాతం ఓటింగ్ జరిగినా బల్దియా పీఠంను అధికార పార్టీ అయిన తెరాస ఎగరేసుకుపోవడం ఖాయమని ఈ ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి.టీఆర్ఎస్ పార్టీ 65-75 స్థానాల్లో విజయకేతనం ఎగురువేయడం ఖాయమని, బీజేపీ 25-35 స్థానాలు గెలుచుకోవడం ఖాయమని, ఎంఐఎం 38-42 స్థానాలు, కాంగ్రెస్ 1-5 స్థానాలను కైవసం చేసుకోనున్నట్లు తెలుస్తోంది.
ఈ మేరకు పీపుల్స్ పల్స్ సర్వే, ఎన్ఎఫ్ఓ సర్వే, ఆరా సంస్థ సర్వేల్లో టీఆర్ఎస్ GHMCపై జెండా ఎగురవేయడం ఖాయమని తేలిపోయింది.మొత్తానికి జీహెచ్ఎంసీ ఎన్నికలు ఎంత రసవత్తరంగా జరిగాయో, వాటి ఫలితాలు అంతకంటే రసవత్తరంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
ఏదేమైనా అధికార పార్టీ టీఆర్ఎస్కే మేయర్ పీఠం కట్టబెట్టేందుకు హైదరాబాదీలు మక్కువ చూపారని, బీజేపీ ఎత్తుగడలకు హైదరాబాదీలు పెద్దగా ఆకర్షితులు కాలేదని ఈ సర్వేలు చెబుతున్నాయి.ఇక కేటీఆర్ ప్రచారం, కేసీఆర్ బహిరంగ సభ కలిసి తెరాసను మరోసారి విజయంవైపు నడిపించాయని రాజకీయ నిపుణులు అంటున్నారు.