ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.రోజురోజుకి అధిక సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.
ఒకవైపు హాస్పిటల్లో బెడ్స్ కొరత , మరోవైపు ఆక్సిజన్ అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు.ఇది ఇలా ఉండగా మరోవైపు ఇలాంటి వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్న కొంతమంది కేటుగాళ్లు శానిటైజర్ నుంచి రెమిడెసివర్ వరకు అన్నీ కూడా నకిలీవి తయారుచేసి ప్రజలలోకి తీసుకొని వస్తున్నారు.
ప్రజలలో ఉండే భయాందోళను ఆసరాగా చేసుకొని అమాయకులైన ప్రజలను మాయ మాటలతో మోసం చేసి సొమ్మును కాజేసుకుంటున్నారు.కొంతమంది అమాయకులు వారి ప్రాణాలను కాపాడుకోవాలని ఆశతో అడిగినంత డబ్బు కట్టి నకిలీవి కొనుగోలు చేస్తున్నారు.
చివరికి జరిగిన మోసం తెలుసుకొని పోలీసులను సంప్రదిస్తున్నారు. తాజాగా ఖాళీ బాటిల్స్ లో సెలైన్ వాటర్ నింపి ఇంజక్షన్లుగా విక్రయిస్తున్న ఒక ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ దారుణమైన సంఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది.కరోనా వైరస్ నుంచి తమ వారిని రక్షించుకోవడానికి బంధువులు ఉరుకులు పరుగులు పెడుతున్న తరుణంలో, వారి ఆయువును నిలబెట్టుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తూన్నారు.
ఈ క్రమంలో దీనినే ఆసరాగా తీసుకున్న కొందరు కేటుగాళ్లు డబ్బును సొంతం చేసుకున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళితే నిజామాబాద్ జిల్లాకు చెందిన రంజిత్ కుమార్ అనే వ్యక్తికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
ఈ క్రమంలో అతని నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందజేస్తున్నారు వైద్యులు.ఈ క్రమంలో వైద్యులు రంజిత్ కుమార్ కు 6 రెమిడెసివర్ ఇంజక్షన్లు అవసరమవుతాయని తెలియజేయగా, మా వద్ద రెమిడెసివర్ లేవని మీరే తెచ్చుకోవాలని తెలియజేశారు ఆసుపత్రి సిబ్బంది వారు.
దీనితో తనకు తెలిసిన వారి వద్ద తీసుకువస్తానని చెప్పి తనకు తెలిసిన ఒక నర్స్ సతీష్ గౌడ్ అనే వ్యక్తిని కలిశాడు.ఈ క్రమంలో ఒక ఆసుపత్రి వైద్యులు సాయిక్రిష్ణ నాయుడు దగ్గర రెమిడెసివర్ ఇంజెక్షన్ లు ఉన్నాయని సమాచారం అందడంతో ఆ డైరెక్టర్ ను కలిశారు.
అయితే ఒక్కో ఇంజక్షన్ కు 30 వేల చొప్పున మూడుకి 90 వేలు చెల్లించాలని అతడు కోరాడు.ఐతే ఆ మొత్తం చెల్లించి ఇంజక్షన్లు తీసుకోని వెళ్లారు కానీ హాస్పిటల్ సిబంది వారు అవి నకిలీవని తేల్చడంతో తిరిగి వాపసు ఇచ్చారు.
కానీ తన దగ్గర తీసుకున్న డబ్బులు ఇవ్వాలని కోరగా సాయిక్రిష్ణ వేరేవి ఉన్నాయని ఇచ్చాడు కానీ ఆ ఇంజక్షన్లు కూడా నకిలీవని తేలడంతో రంజిత్ కుమార్ వెంటనే పోలీసులను కలిసాడు.దింతో పోలీసులు సాయికృష్ణ, సతీష్ గౌడ్ అదుపులోకి తీసుకోని విచారణ చేసారు.