ప్రఖ్యాత గాయకుడు, పద్మశ్రీ ఘంటసాల గారి శత జయంతి సందర్భంగా తెలుగు ఎన్నారైలకు చెందిన పలు సంస్థలు ఓ గొప్ప మహోద్యమానికి శ్రీకారం చుట్టాయి.ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్, వంగూరి ఫౌండేషన్, సింగపూర్ లోని శ్రీ సాంస్కృతిక కళాసారధి, శుభోదయం, వంశీ ఇంటర్నేషనల్ వంటి ప్రఖ్యాత సంస్థల ఆధ్వర్యంలో దాదాపు 365 రోజుల పాటు నిర్విరామంగా ఘంటసాల స్వర రాగ మహా యాగాన్ని వర్చువల్ గా ఏర్పాటు చేసి ఘనంగా ప్రారంభించారు.
ఈ పాటల మహోద్యమానికి ఘంటసాల సతీమణి, కుమార్తెలు పాల్గొన్నారు.ఘంటసాల పాడిన పాటలు తెలుగు ప్రజలకు ఎలాంటి ఊరడింపు ఇచ్చాయి, ఆయన గానామృతంతో స్వర సంగీతానికి చేసిన విశేష కృషిని పలువురు సినీ పెద్దలు, రచయితలు , సంగీత దర్శకులు కొనియాడారు.
ఘంటసాల కుమార్తెలు, ప్రార్ధనా గీతం ఆలపించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.వంగూరి ఫౌండేషన్ ఛైర్మన్ జగన్ మోహన్ రావు మొదలగువారు ఘంటసాల సంగీత ప్రపంచానికి చేసిన సేవలను కొనియాడారు.డిసెంబర్ 4 .2021 న మొదలైన ఈ గానామృతం వచ్చే ఏడాది
డిసెంబర్ -4-2022 వరకూ కొనసాగుతుందని ప్రతీ రోజు సుమారు గంట పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గాయనీ గాయకులు ఈ ఘంటసాల పాటలను వినిపిస్తారని, రచయితలు ఘంటసాల పై రచనలు చేస్తారని తెలిపారు.ఈ కార్యక్రమం ముగింపు వేడుకలను సింగపూర్ లో ఏర్పాటు చేయనున్నట్లుగా నిర్వాహకులు తెలిపారు.
భారత కాలమానం ప్రకారం ప్రతీ శని , ఆది వారాలలో ఉదయం 10 గంటలకు అలాగే సోమవారం నుంచీ శుక్రవారం వరకూ రాత్రి 9 గంటల సమయంలో ప్రసారం చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమాన్ని వీక్షించాలని అనుకునే ప్రతీ ఒక్కరూ శుభోదయం మీడియా, వంశీ ఆర్ట్ థియేటర్స్ వారి యూట్యూబ్ లో లైవ్ లో వీక్షించవచ్చునని తెలిపారు.