కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పెళ్లి చేసుకునే యువతులకు ప్రయోజనం చేకూరేలా పలు పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.అయితే వివిధ రాష్ట్రాలు అమలు చేస్తున్న పథకాలకు భిన్నంగా కులాంతర వివాహాలను, మతాంతర వివాహాలను ప్రోత్సహించేలా ఉత్తరాఖాండ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
కులాంతర వివాహం, మతాంతర వివాహం చేసుకున్న జంటలకు 50,000 రూపాయలు ఇస్తామని ఉత్తర్వులు విడుదల చేసింది.అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి స్కీమ్ పెట్టడం లో వింతేమీ లేకపోయినా ఈ స్కీమ్ కోసం పెట్టిన షరతుల గురించి నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీమ్ ద్వారా 50,000 రూపాయలు పొందాలంటే భార్యాభర్తలలో ఎవరో ఒకరు షెడ్యూల్ కులాలకు చెంది ఉండాలని అక్కడి ప్రభుత్వం నిబంధనలు రూపొందించింది.
ఆ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ డిపార్టుమెంట్ నుంచి ఈ మేరకు ఉత్తర్వులు విడుదలయ్యాయి.
దేశంలో ఐక్యత కోసం కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్న వాళ్లకు నగదు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు తెహ్రీ అగర్వాల్ జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.వివాహం చేసుకున్న జంట వివాహమైన ఏడాదిలోగా దరఖాస్తు చేసుకొని నగదు పొందవచ్చు.
అయితే ప్రభుత్వం నుంచి విడుదలైన ఉత్తర్వులు లవ్ జీహాద్ ను ప్రోత్సహించే విధంగా ఉన్నాయని హిందువులు మండిపడుతున్నారు ప్రభుత్వ ఉత్తర్వులు మత మార్పిడులను ప్రోత్సహించే విధంగా ఉన్నాయని కామెంట్లు చేస్తున్నారు.ఈ ఉత్తర్వులపై కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వెనక్కు తగ్గుతుందో లేదో చూడాల్సి ఉంది.షెడ్యూల్డ్ కులాలకు, షెడ్యూల్ తెగలకు చెందిన మహిళలు ఇతర మతాల్లోకి మారాలని ప్రోత్సహించే విధంగా ఈ ఉత్తర్వులు ఉన్నాయని సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.