మీరు క్రెడిట్ కార్డు వినియోగిస్తున్నారా …? పేటీఎం, గూగుల్ పే మొబైల్ యాప్ లు వినియోగిస్తున్నారా …? మీ డెబిట్ కార్డులు అప్ డేట్ చేస్తాం.బీమా సొమ్ముకు బోనస్ ఇస్తాం.
తక్కువ వడ్డీకే రుణం ఇస్తాం.అంటూ మెయిల్ ద్వారా గానీ, ఫోన్ ద్వారా గానీ మాట్లాడుతున్నది అంటే వాళ్ళు కచ్చితంగా సైబర్ నేరస్థులే.
వారి మాటలు నమ్మి బినామీ ఖాతాల్లో నగదు జమచేస్తూ చాలామంది బాధితులుగా మిగులుతున్నారని పోలీస్ అధికారులు అంటున్నారు.బాధితుల నుంచి జమ చేసుకున్న నగదును ఈ – వ్యాలెట్ లోకి, లేకపోతే తమ బినామీ ఖాతాలకు సైబర్ నేరస్థులు మళ్లిస్తున్నారు.
లాటరీలో రూ.25 లక్షల బహుమతి అంటూ మోసం చేసిన ఓ సైబర్ నేరస్థుడు రూ.లక్షల్లో కొల్లగొట్టి.నగదును తన బినామీ ఖాతాల్లోకి జమ చేయించుకున్నాడు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా ఈ ఖాతాలు రాజస్థాన్, మధ్యప్రదేశ్, తమిళనాడులో ఉన్నట్లు తెలిసింది.ఇటువంటి సైబర్ నేరస్థుల బినామీ ఖాతాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.
ఆన్ లైన్ మోసాలు, నైజీరియన్ల మోసాలు, డెబిట్, క్రెడిట్ కార్డుల పిన్ నంబర్లు తెలుసుకుని నగదు స్వాహా… ఈ తరహా నేరాలకు పాల్పడే వ్యక్తులు, అంతరాష్ట్ర ముఠాలను గుర్తించేందుకు పోలీస్ ఉన్నతాధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.ఈ బృందాలు ఢిల్లీ, ముంబయి, గుర్ గ్రామ్ లలో ఉంటున్న వారి కదలికలను రహస్యంగా గమనిస్తున్నాయి.
బ్యాంకుల ద్వారా అంతరాష్ట్ర ముఠాల కార్యకలాపాలను కట్టడి చేస్తే స్వాహా చేసిన సొమ్ములో యాభై శాతం నగదును వారి ఖాతాలను స్తంభింపజేయడం ద్వారా స్వాధీనం చేసుకోవచ్చని చెబుతున్నారు.బాధితులకు ఫోన్ చేసిన వెంటనే నేరస్థులు పలానా ఖాతాలో సొమ్ము జమ చేయమంటూ చెబుతారు.వారు ఆ ఖాతాలో నగదు జమ చేయగానే… కొద్ది గంటల వ్యవధిలో ఏటీఎం ద్వారా సొమ్మును విత్ డ్రా చేసుకుంటున్నారు.హైదరాబాద్ లో బాధితుడు జమ చేసిన ఖాతా ఎప్పుడు ప్రారంభమైంది.? చిరునామా ఎవరిది…? ఫోన్ నంబర్లు ఎన్ని ఉన్నాయి.? ఏ ఏటీఎం కేంద్రంలో విత్ డ్రా చేసుకున్నాడన్న వివరాలను బ్యాంకు అధికారుల వేగంగా పోలీసులకు ఇస్తే వెంటనే వారిని పట్టుకునే వీలుంటుంది.