ప్రపంచవ్యాప్తంగా మాంద్యం భయాల కారణంగా ఉద్యోగుల తొలగింపు తీవ్రతరమైంది.దిగ్గజ కంపెనీలు సైతం లే ఆఫ్లు ప్రకటిస్తున్నాయి.
దీంతో అనేక దేశాల్లో వేలాది మంది ఉద్యోగులు రోడ్డున పడుతున్నారు.రాబోయే రోజుల్లో వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం వుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
కానీ మరికొన్ని దేశాల్లో మాత్రం దీనికి విరుద్ధమైన పరిస్ధితులు నెలకొంటున్నాయి.అక్కడ లక్షల్లో ఉద్యోగాలు ఖాళీగా వుండగా.
ఉద్యోగుల కోసం కంపెనీలు వెతుక్కుంటున్నాయి.ఇలాంటి వాటిలో జర్మనీ కూడా ఒకటి. ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థ అయిన జర్మనీ .ఆటోమొబైల్ ఇండస్ట్రీకి పెట్టింది పేరు.ప్రపంచంలోనే పేరు మోసిన వాహన తయారీ కంపెనీలకు జర్మనీ పుట్టినిల్లు.అందుకే ఇటీవలి కాలంలో పలు దేశాలకు చెందిన వారు విద్య, ఉద్యోగం కోసం జర్మనీ వైపు చూస్తున్నారు.
అయితే కఠినమైన ఇమ్మిగ్రేషన్ నిబంధనలు ఇందుకు ప్రతిబంధకంగా మారుతున్నాయి.కోవిడ్ నేపథ్యంలో ఉద్యోగులు వారి వారి స్వదేశాలకు వెళ్లిపోవడంతో జర్మనీలో నిపుణుల కొరత వేధిస్తోంది.ఈ క్రమంలోనే ఇమ్మిగ్రేషన్ నిబంధనల్లో సంస్కరణలు తీసుకురావాలని ఆ దేశ ప్రభుత్వం భావిస్తోంది.
ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంప్లాయ్మెంట్ రీసెర్చ్ ప్రకారం.జర్మనీకి ప్రతి యేటా 4 లక్షల మంది నైపుణ్యం కలిగిన నిపుణులు అవసరమని అంచనా.అయితే గతేడాది రెండు లక్షల మంది విదేశీయులు జర్మనీకి రాగా.
వీరిలో భారతీయులదే అగ్రస్థానం. డిజిటలైజేషన్ వైపు మొగ్గు చూపుతున్న జర్మనీకి భారీగా నిపుణులు అవసరం.
అందుకే నైపుణ్యం కలిగిన వారిని ఆకర్షించేందుకు పౌరసత్వ చట్టాల్లో భారీ మార్పులకు శ్రీకారం చుడుతోంది.ఇది విదేశీ వృత్తి నిపుణులకు ద్వంద్వ పౌరసత్వాన్ని అనుమతిస్తుంది.అలాగే విదేశీయులకు పౌరసత్వాన్ని ఇచ్చేందుకు జర్మనీలో కనీసం ఎనిమిదేళ్లు వుండాలన్న నిబంధనను ఐదేళ్లకు తగ్గిస్తుంది.
మరోవైపు… ఇమ్మిగ్రేషన్ సంస్కరణలకు సంబంధించి రూపొందించిన కొత్త ముసాయిదాలో భాగంగా భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ .జైశంకర్తో జర్మనీ విదేశాంగ మంత్రి అన్నలెనా బేర్బాక్లు పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు.