ఒక్కసారి రాజకీయాల్లోకి అడుగు పెట్టాక సైలెంట్ గా ఉండాలి అంటే అది కుదరని పని.ఏదో ఒక అంశంపై తప్పకుండా స్పందించాల్సిన పరిస్థితి ప్రతి రాజకీయ నాయకుడి కి వస్తుంది.
ఇక పార్టీ అధినేత అయితే ఇది తప్పనిసరి.ప్రతి విషయంలోనూ తన అభిప్రాయాన్ని తప్పకుండా చెప్పాల్సిందే.
ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో అన్ని పార్టీల సంగతి ఎలా ఉన్నా, జనసేన పార్టీ మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటోంది.విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం మరోసారి తెరమీదకు వచ్చింది.
కేంద్రం స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరించేందుకు ప్రయత్నిస్తుండటంతో , ఏపీ లోని అన్ని రాజకీయ పార్టీలు స్పందించి స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించేందుకు ఒప్పుకోము అన్నట్లుగా స్టేట్మెంట్స్ ఇస్తున్నాయి.కానీ జనసేన ఈ విషయంలో బీజేపీకి మద్దతు ఇస్తోంది.
పైగా ఈ విషయంలో పోరాడాల్సింది వైసీపీ ప్రభుత్వం మాత్రమే అన్నట్లుగా ఆయన స్టేట్మెంట్స్ ఇస్తున్నారు.
ఇక ఈ స్టీల్ ప్లాంట్ ఉద్యమంలోకి అందరి కంటే ముందుగా వచ్చి స్పందించింది ఎవరైనా ఉన్నారా అంటే అది గంట శ్రీనివాస రావు మాత్రమే.
ఆయన తన ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేసి స్టీల్ ప్లాంట్ ఉద్యమంలోకి వచ్చారు.అంతేకాదు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల నమ్మకాన్ని ఆయన పొందిన గంటా ఇప్పుడు జనసేన అధినేత పవన్ ఈ ఉద్యమంలోకి రావాలని పదేపదే పిలుపు ఇస్తున్నారు.
గంటా శ్రీనివాసరావు ఈ విధంగా పిలుపునివ్వడం పవన్ కు ఇబ్బందికరంగా మారింది.అవసరమైతే ఈ ఉద్యమం కోసం బిజెపితో జనసేన పొత్తు రద్దు చేసుకోవాలని గంటా సూచిస్తున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం తెరపైకి రాగానే, పవన్ డిల్లీ కి వెళ్లి కేంద్ర బిజెపి పెద్దలను కలిసి, స్టీల్ ప్లాంట్ విషయంలో చర్చలు జరిపారు.కానీ కేంద్ర బీజేపీ పెద్దలు ఈ విషయంలో పవన్ ను సైలెంట్ అవ్వాల్సిందిగా సూచించడం వంటి కారణాలతో స్టీల్ ప్లాంట్ వ్యవహారంపై పవన్ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.సినిమా షూటింగుల్లో బిజీగా ఉంటున్నారు.కానీ గంటా శ్రీనివాసరావు మాత్రం పదే పదే పవన్ ను ఉద్యమంలోకి రావాలని స్టేట్మెంట్లు ఇస్తూ, రాజకీయంగా జనసేన కు ఇబ్బందులు సృష్టిస్తున్నట్టుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి.