గన్నవరంలో రాజకీయంగా అంటుకున్న మాటలు ఇంకా చల్లారలేదు.ఉవ్వెత్తున ఎగిసి పడుతూనే ఉన్నాయి.
గన్నవరం టిడిపి ఎమ్మెల్యే వంశీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు, లోకేష్ పై చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ టిడిపి నాయకులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించగా, టిడిపి గన్నవరం ఆఫీస్ పై వంశీ అనుచరులుగా అవమానిస్తున్న కొంతమంది వ్యక్తులు దాడులు చేయడం, ఆఫీస్ ఫర్నిచర్ ధ్వంసం చేయడం, కార్లు తగలబెట్టడం వంటివి చేశారు.ఇక తరువాత ఆందోళనకారులను అడ్డుకునేందుకు టిడిపి నాయకులు రంగంలోకి దిగడం తదితర పరిణామాలతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ప్రస్తుతం గన్నవరంలో పోలీసులు భారీగా కనిపిస్తున్నారు.బయటి వాళ్లు ఎవరూ గన్నవరం రాకుండా జాగ్రత్త చర్యలు చేపట్టారు.ఈ మేరకు గన్నవరం శివార్లలో భారీగా పోలీసులను మోహరించారు.నూజివీడు, ఆగిరిపల్లి నుంచి గన్నవరం వచ్చే మార్గాన్ని దిగ్బంధించారు.
కొనవ చెరువు దగ్గర చెక్ పోస్ట్ ను ఏర్పాటు చేశారు.ఏలూరు గన్నవరం హైవే పైన పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.
టిడిపి శ్రేణులు గన్నవరం తరలిరాకుండా పోలీసులు అన్ని ముందస్తు జాగ్రత్తలు చేపట్టి వాహనాలను తనిఖీ చేస్తున్నారు.ఇప్పటికే గన్నవరంలో 144 సెక్షన్ ను విధించడంతో పాటు, 30 పోలీస్ యాక్ట్ ను అమలు చేస్తున్నారు.
ఈ పరిణామాలపై టిడిపి శ్రేణులు భగ్గుమంటున్నాయి.
ఫ్యాక్షనిస్ట్ పాలన ఎలా ఉంటుందో ప్రజలు చూస్తున్నారని, టిడిపి నేత బోండా విరుచుకుపడ్డారు .కొంతమంది పోలీసు అధికారులు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారని, మరికొంతమంది అధికారులు వైసీపీ కండువా వేసుకుని పని చేస్తున్నారని బోండా ఉమBonda విమర్శించారు.గన్నవరం ఎమ్మెల్యే అరాచకాలను ప్రశ్నించడం తప్పా ? ఎమ్మెల్యే అవినీతిని వెలికి తీయడం తప్ప అని బోండా ప్రశ్నించారు.మా ఆఫీస్ పై దాడికి జగన్ సమాధానం చెప్పాలని బోండా ఉమ నిలదీశారు.
ఇక ఎక్కడకక్కడ టిడిపి నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు.
గొల్లపూడి లో బోండా ఉమ, నెట్టెం రఘురాం , తంగిరాల సౌమ్యాలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.ఇక నిన్న పోలీసులు అరెస్ట్ తీసుకువెళ్లిన టిడిపి కీలక నేత కొమ్మిరెడ్డి పట్టాభి ఆచూకీ చెప్పాలని ఆయన భార్య చందన పోలీసులను డిమాండ్ చేశారు.తన భర్తను ఎవరు తీసుకు వెళ్లారు ? ఎక్కడికి తీసుకెళ్లారు అనే విషయంలో ఖచ్చితమైన సమాచారం ఇవ్వాలని, లేకపోతే డీజీపీ ఇంటి ముందు నిరాహారదీక్ష చేస్తానంటూ ఆమె వార్నింగ్ ఇచ్చారు.ప్రస్తుతం గన్నవరంలో ఉద్రిక్తత పరిస్థితి కొనసాగుతూనే ఉంది.