తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ లో ఇప్పుడు అసంతృప్తి జ్వాలలు అలుముకున్నాయి.రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ రెండో సారి చేపట్టిన మంత్రివర్గ విస్తరణలో పదవులు ఆశించి భంగపడ్డ నాయకులు ఇప్పుడు అధిష్టానం మీద కారాలు, మిరియాలు నూరుతున్నారు.
టీఆర్ఎస్ పార్టీ క్రేజ్ తగ్గుతూ బీజేపీ హావ పెరుగుతున్న సమయంలో అసంతృప్తులు పెరగడం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలవరపెడుతోంది.ఒక్కో నేత తమ అసంతృప్తిని బయటకి వెళ్లగక్కుతూ అధిష్టానం మీద తిరుగుబాటు జెండా ఎగురవేస్తున్నారు.
మంత్రివర్గ మార్పులకు ముందు నుంచే క్రమక్రమంగా అసమ్మతి నేతలు గళం విప్పుతున్నారు.ముందుగా మంత్రి ఈటల రాజేందర్ ఆ వెంటనే మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అసంతృప్తి వ్యక్తం చేయగా ఇక మంత్రివర్గ విస్తరణ జరిగిన వెంటనే మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి కేసీఆర్ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు.
తనకు మంత్రి పదవి ఇస్తానని కేసీఆర్ మాట ఇచ్చి తప్పారని ఆయన ఫైర్ అయ్యారు.ఇక మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య సైతం 12 శాతం ఉన్న మాదిగలకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.మరో మాజీ మంత్రి జోగు రామన్న అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.తాజాగా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సైతం ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరైన ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంలో తనకు పని లేనందునే పరీక్షలు రాస్తున్నానని ఏదైనా పదవి ఇస్తే పని చేస్తానంటూ వ్యాఖ్యానించారు.కాంగ్రెస్ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో కలిస్తే ఒక్కరికే మంత్రి పదవి ఇస్తారా అంటూ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు.
మరొకరికి మంత్రి పదవి ఇస్తే బాగుండేదన్నారు.
అప్పట్లో మమ్మల్ని అరెస్టులు చేయించి రాత్రిళ్లు స్టేషన్లో కూర్చో పెట్టిన సబితకు ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వడం ఏంటని హైదరాబాద్ కు చెందిన ఓ ఎమ్యెల్యే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావుకు కేబినెట్లో చోటు లభించకపోవడంతో అలక పూనినట్లు సమాచారం.మంత్రి పదవి దక్కకపోవడంతో టీఆర్ఎస్ అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు.
ఇక ఇప్పుడు పదవులు రాని వారంతా పక్క చూపులు చేస్తున్నట్టు తెలుస్తోంది.దీనిపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కూడా సమాచారం ఉండడంతో నష్ట నివారణకు చర్యలు ప్రారంభించినట్టు పార్టీలో నాయకులు మాట్లాడుకుంటున్నారు.
ఇదే అదునుగా బీజేపీ కూడా టీఆర్ఎస్ అసంతృప్తులకు గేలం వేస్తూ తమ పార్టీలో చేరేలా వారితో రాయబారాలు నడుపుతున్నట్టు తెలుస్తోంది.
.