రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి.వలస పాలన నుంచి భారతావని స్వేచ్ఛావాయువులు పీల్చుకోవడానికి ప్రధాన కారణం జాతిపిత మహాత్మాగాంధీ.
ఓ సామాన్యుడిలా జీవితాన్ని ప్రారంభించిన గాంధీ… తర్వాతి రోజుల్లో మహాత్ముడిగా మారిన తీరు అమోఘం, అనన్య సామాన్యం.సత్యాగ్రహం, అహింస అనే ఆయుధాలతోనే ఆంగ్లేయులను దేశం నుంచి తరిమికొట్టారు బాపూజీ.ఒక్క భారతావనికే కాకుండా ప్రపంచం మొత్తానికి స్ఫూర్తిగా నిలిచిన మహోన్నత వ్యక్తి గాంధీ.తరాలు….యుగాలు గడిచినా జాతిపిత మహాత్మాగాంధీ జీవనం ఎప్పటికీ స్ఫూర్తిదాయకమే.గాంధీ అహింస సిద్ధాంతం కాలాతీతం.దానికి మరణం లేదు.గాంధీ మహాత్ముడికి భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులున్నారు.
ఎన్నో దేశాల్లో వీధి వీధినా ఆయన విగ్రహాలు వున్నాయి.శాంతికే ప్రతిరూపమైన బాపూజీ మార్గాన్ని నాటి నుంచి నేటి వరకు ఎందరో దేశాధినేతలు, సంఘసంస్కర్తలు, ప్రజాస్వామ వాదులు అనుసరించారు.
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో గాంధీ విగ్రహాలు, ఆయన పేరిట పార్కులు, రహదారులు వున్నాయి.అయితే గాంధీ ఆశయాలు, సిద్ధాంతాలు భవిష్యత్ తరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో అట్లాంటిక్ సిటీలో గాంధీ మ్యూజియం ప్రారంభమైంది.
గత వారం చివరిలో ప్రారంభించబడిన ఈ మ్యూజియంలో అద్భుతమైన కళాఖండాలు, డిజిటల్ డిస్ప్లే స్క్రీన్లు వుంచారు.ఈ కార్యక్రమంలో ఇండియన్ కమ్యూనిటీ సభ్యులు, న్యూయార్క్లోని భారత కాన్సుల్ జనరల్ రణధీర్ జైస్వాల్ తదితరులు పాల్గొన్నారు.
న్యూజెర్సీకి చెందిన గాంధీయన్ సొసైటీ ద్వారా ఆదిత్య బిర్లా గ్రూప్ భాగస్వామ్యంతో ఈ మ్యూజియంను నెలకొల్పారు.ఇది అమెరికాలో జాతిపితకు అంకితం చేయబడిన తొలి మ్యూజియం.మార్టిన్ లూథర్ కింగ్ ఫౌండేషన్ కూడా ఈ కార్యంలో భాగస్వామిగా వుంది.భారత కాన్సుల్ జనరల్ రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.గాంధీయన్ సొసైటీ, దాని వ్యవస్థాపకుడు భద్ర భూటాల కృషిని ప్రశంసించారు.ఈ మ్యూజియాన్ని అమెరికాకు తీసుకొచ్చినందుకు బిర్లా గ్రూప్ను కూడా ఆయన మెచ్చుకున్నారు.