ఏపీ విషయంలో తాము జోక్యం చేసుకోమని కేంద్రం రెండు రోజుల క్రితం పార్లమెంటులో స్పష్టమైన ప్రకటన చేయడంతో పాటు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చేసింది.దీంతో ఇక ఈ సమస్య సర్దుమణిగిపోయిందని అంతా భావించారు.
కానీ అమరావతి మంటలు ఇంకా చల్లారినట్టుగా కనిపించడం లేదు.ఇప్పటికే దీనిపై రాజకీయ పార్టీలు రక రకాల ప్రకటనలతో గందరగోళం సృష్టిస్తూ ఉండటం, దీని పై బిజెపి నేతలు స్పందిస్తూ ఏపీ విషయాల్లో తాము జోక్యం చేసుకోము అంటూ ప్రకటించడం ఇలా వరుసగా పరిణామాలు జరుగుతూనే ఉన్నాయి.
తాజాగా ఈ రోజు పార్లమెంట్ లో ఇదే అంశంపై వాడి వేడిగా చర్చ జరుగుతోంది.
టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ మూడు రాజధానులు అంశాన్ని లేవనెత్తారు.ఏపీ రాజధాని అంశం కేవలం రాష్ట్రం పరిధిలోనిది కాదు అని ఇది జాతీయ సమస్య అంటూ ఆయన ప్రసంగించారు.ఈ దేశంలో ఏ రాష్ట్రంలో మూడు రోజులు ఉన్నాయి అంటూ ప్రశ్నించారు.
ఈ సందర్భంగా జగన్ ను ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.మూడు రాజధానుల నిర్ణయంతో జగన్ తుగ్లక్ తో పోలుస్తున్నారు అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
దీనిపై ఆగ్రహం చెందిన వైసీపీ ఎంపీలు జయదేవ్ ప్రసంగానికి అడ్డు తగులుతూ ఆందోళన చేశారు.దీనిపై స్పీకర్ సీట్లో కూర్చున్న డి.రాజా జయదేవ్ ప్రసంగంపై అభ్యంతరం తెలిపారు.అంతేకాకుండా గల్లా జయదేవ్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు.
గల్లా జయదేవ్ ఎక్కడా వెనక్కి తగ్గకుండా తన ప్రసంగాన్ని అదే స్పీడ్ తో కొనసాగించారు.దీనిపై వైసీపీ ఎంపీలు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.అమరావతి విషయంలో చంద్రబాబు చాలా తప్పులు చేశారని, రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలని ఏపీ సీఎం జగన్ చూస్తున్నారని, అన్ని విధాలుగా రాష్ట్రానికి న్యాయం చేస్తారని వైసీపీ ఎంపీలు సభలో ప్రసంగించారు.ఇప్పటికే కేంద్రం తన వైఖరిని స్పష్టంగా చెప్పినా టీడీపీ ఎంపీలు, ఆ పార్టీ నాయకులు అమరావతి విషయంపై ఇంకా వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు.
తాజగా జగన్ ను తుగ్లక్ అంటూ జయదేవ్ పోల్చడాన్ని వైసీపీ తీవ్రంగా పరిగణిస్తోంది.