ప్రస్తుతం ఏపీలో వైసీపీ అధికారంలో ఉంది.ఇతర పార్టీల నుంచి చేరికలు అదేవిధంగా చోటు చేసుకుంటున్నాయి.
టిడిపి, జనసేన ,బీజేపీ నుంచి పెద్ద ఎత్తున నాయకులూ వచ్చి చేరుతున్నారు.పార్టీ అధికారంలో ఉండటంతో తమకు తగిన ప్రాధాన్యం దక్కుతుందనే అభిప్రాయం, రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎంతోమంది వైసిపి బాట పట్టారు.
ఇంకా వైసీపీ ప్రభుత్వం రెండేళ్ల పాటు అధికారంలో ఉంటుంది.పార్టీలో చేరే వారు తప్ప బయటకు వెళ్లే వారు ఎక్కడా కనిపించడం లేదు.
కానీ దీనికి భిన్నం గా తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో వైసీపీకి మూకుమ్మడిగా రాజీనామాలు చేయడం కలకలం రేపింది.అకస్మాత్తుగా వైసిపి కార్యకర్తలు, నాయకులు పార్టీకి రాజీనామా చేయడం కలకలం రేపింది.
అది కూడా వైసిపి జిల్లా అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే అయిన జక్కంపూడి రాజా నియోజకవర్గం లోని గాదరాడ గ్రామంలో చోటుచేసుకోవడం మరింత సంచలనంగా మారింది.
వైసీపీలో తమకు తగిన ప్రాధాన్యం దక్కకపోవడంతో పాటు , పార్టీ అధికారంలో ఉన్నా… ప్రజలకు తగిన విధంగా సహాయం అందించలేకపోతున్నామనే ఆవేదనతో గాదరాడ ఎంపిటిసి బత్తుల వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో దాదాపు 500 మంది వైసీపీ కార్యకర్తలు మూకుమ్మడిగా పార్టీకి రాజీనామా చేశారు .గాదరాడ ఎంపిటిసి బత్తుల వెంకటలక్ష్మి తన ఎంపిటిసి పదవికి సైతం రాజీనామా చేశారు.ఈ మేరకు కోరుకొండ ఎంపీడీవో నరేష్ కుమార్ కు తన రాజీనామా లేఖను అందించారు.
ఈ సందర్భంగా గాదరాడ గ్రామం నుంచి భారీ ర్యాలీగా రాజమండ్రి వచ్చిన ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు.తనను ప్రజలు 1200 మెజారిటీతో గెలిపించినా.పార్,టీ ప్రభుత్వపరంగా పూర్తిగా సేవలు చేయలేకపోయాను అని ,అందుకే కలత చెంది పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు.
గ్రామ సమస్యల గురించి స్థానిక ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కు దృష్టికి తీసుకువెళ్లినా ఎటువంటి ఫలితం ఉండడం లేదని , అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వారు ప్రకటించారు.ప్రస్తుతం గాదరాడ గ్రామంలో తాగునీరు ,విద్యుత్ సదుపాయాలు లేకపోవడం, ఎమ్యెల్యే పట్టించుకోకపోవడం తదితర కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.ఈ వ్యవహారం పై వైసిపి అధిష్టానం సైతం ఆరా తీసినట్లు సమాచారం.