రైతులు పంటలు పండించేందుకు పడే కష్టంలో వారికి తోడుగా అంతే కష్టాన్ని పంచుకుంటాయి పాడి పశువులు.ఆవులు, ఎద్దులు, గేదెలు పొలంలో నాగలిదున్ని రైతుకు పంటలు పండేందుకు తోడ్పటంతో వాటిని సొంత పిల్లల్లా చూసుకుంటారు రైతులు.
అయితే ఇలాంటి పాడిపశువులు చనిపోతే ఆ రైతుల ఆవేదన వర్ణనాతీతం.కాగా ఉత్తరప్రదేశ్లోని మహోబా జిల్లా జైత్పూర్ పరిధిలోని ముఢారీ గ్రామంలోని బలరామ్ మిశ్రా అనే రైతు తన ఆవు చనిపోవడంతో కన్నీటి పర్యంతం అయ్యాడు.
తన కుటుంబానికి ఎంతో సేవలు చేసిన ఆవు ఓ దూడకు జన్మినిచ్చిన తరువాత మృతిచెందింది.దీంతో సాంప్రదాయ బద్దంగా ఆవుకు అంత్యక్రియలు జరిపించాడు ఆ రైతు.ఆవు కళేబరానికి ఎర్రటి వస్త్రాన్ని కప్పి బండిలో ఊరంతా తిప్పుతూ అంతిమయాత్ర నిర్వహించాడు.ఈ అంతిమయాత్రలో గ్రామస్తులు అందరూ పాల్గొని కన్నీటి పర్యంతం అయ్యారు.
ఆవు చనిపోవడంతో రైతు ఆవేదన వారిని కలిచి వేసింది.
వేద మంత్రాలతో ఆవుకు అంతిమ సంస్కారాలు నిర్వహించిన బలరాం, తన ఆవు అస్తికలను పవిత్ర నదిలో కలుపుతానని చెప్పి, తన ఆవుపై తనకున్న ప్రేమను చాటాడు.
ఏదేమైనా ఈ రైతు చేసిన పని గ్రామస్తులను కదిలించింది.