కరోనా వల్ల ప్రపంచంలోనే తీవ్రంగా నష్టపోయిన దేశాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ యుద్ధం చేస్తున్నారు. 100 రోజుల ప్రణాళిక పేరిట ఆ మహమ్మారిని దేశం నుంచి తరిమికొట్టడంతో పాటు ఆర్ధిక వ్యవస్ధను పట్టాలెక్కించాలని ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
ఇప్పటికే దేశంలో పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమానికి తెరదీశారు.దీనిని మరింత పెంచేందుకు గాను బైడెన్ యంత్రాంగం జాన్సన్ అండ్ జాన్సన్ తయారు చేసిన సింగిల్ డోస్ వ్యాక్సిన్ను అత్యవసర వినియోగానికి అనుమతినిచ్చింది.
అలాగే దేశవ్యాప్తంగా భారీ ఎత్తున మాస్కులు పంపిణీ చేయాలని బైడెన్ నిర్ణయించారు.2.5 కోట్లకు పైగా మాస్కులను పంపిణీ చేసేందుకు సర్కార్ సిద్ధమైంది.కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఫుడ్ ప్యాంట్రీలు, సూప్ కిచెన్లలో వీటిని పంపిణీ చేయనున్నట్లు వైట్హౌస్ కొద్దిరోజుల క్రితం ప్రకటించింది.
వైరస్ వ్యాప్తిని నిలువరించడంలో మాస్కులు కీలకమని ఈ సందర్భంగా ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.ఇప్పటికీ పేద అమెరికన్లు మాస్కులు కొనుగోలు చేయలేకపోతున్నారని, వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ భారీ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు అధ్యక్ష కార్యాలయం పేర్కొంది.
మార్చి నుంచి మే మధ్య కాలంలో దేశంలోని 1300 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 60,000 ఫుడ్ ప్యాంట్రీలు, సూప్ కిచెన్లలో మాస్కుల పంపిణీ చేస్తామని వైట్హౌస్ తెలిపింది.
ఇందుకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్న వేళ.మాస్క్ ధరించడంపై యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) కీలక ప్రకటన విడుదల చేసింది.ఎవరైతే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారో.
వారు మాస్క్ ధరించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.అయితే, వారు కలిసే ఎదుటి వ్యక్తులు కూడా వ్యాక్సినేషన్ పూర్తి చేసుకుని ఉండాలని వెల్లడించింది.
అప్పుడు మాత్రమే మాస్క్ ధరించకుండా వారితో కలవొచ్చని పేర్కొంది.ప్రస్తుతం దేశ జనాభాలో కేవలం 9.2 శాతం మందికి మాత్రమే వ్యాక్సినేషన్ పూర్తైందని, అలాగే 18 శాతం (దాదాపు 58.9 మిలియన్) మంది ఒక డోసు టీకా తీసుకున్నారని సీడీసీ డైరెక్టర్ రోషెల్ వాలెన్స్కీ ప్రకటించారు.కాగా, ఇటీవల దేశంలోని కొన్ని రాష్ట్రాలు, నగరాల్లో కోవిడ్ ఆంక్షలను ఎత్తివేశారు.రాష్ట్ర ప్రజలు ఇకపై మాస్క్లు ధరించడం తప్పనిసరి కాదంటూ టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబోట్ ఇటీవల ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం దేశంలో కరోనా టీకాలు, మెరుగైన పరీక్షలు, చికిత్సా విధానం అందుబాటులోకి రావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని గవర్నర్ స్పష్టం చేశారు
.