దేశంలో గత కొన్ని నెలల నుంచి నిత్యావసర వస్తువుల ధరలు, గ్యాస్ ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి.కరోనా వల్ల ప్రజలకు ఆదాయం తగ్గిన నేపథ్యంలో ధరలు పెరగడం వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు.
ఇదే సమయంలో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా రోజురోజుకు పెరుగుతుండటం గమనార్హం.పలు రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర 100 రూపాయలు దాటగా వాహనదారుల నుంచి పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని వాహనదారులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు.రోజురోజుకు పెట్రోల్ ధరలు పెరుగుతుండటంతో ప్రశాంత్ భూషణ్ అనే న్యాయవాది పెట్రోల్ ధరల విషయంలో 2013లో నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను, తాజాగా పెట్రోల్ ధరల విషయంలో నిర్మలా సీతారామన్ చేసిన కామెంట్లకు సంబంధించిన వీడియోను పక్కపక్కన పెట్టి షేర్ చేశారు.
2013 సంవత్సరంలో నిర్మలా సీతారామన్ పెట్రోల్ ధరలు పెరిగితే ధరల పెరుగుదలకు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానిదే తప్పు అని విమర్శలు చేశారు.ఇప్పుడు మాత్రం పెట్రోల్ ధరల విషయంలో ఆయిల్ కంపెనీలదే బాధ్యత అని కామెంట్లు చేశారు. ప్రశాంత్ భూషణ్ చేసిన ట్వీట్ వైరల్ కాగా ఆ ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ సిద్దార్థ్ కీలక వ్యాఖ్యలు చేశారు.” మామి (ఆంటీ) నమ్మిన విషయన్ని అనువుగా మార్చుకోవడంలో తరువాత స్థాయికి చేరుకున్నారని.ఉల్లిపాయలు లేవు, మెమరీ లేవు, ప్రిన్సిపల్స్ లేవు.మామి రాక్స్” అంటూ ట్వీట్ చేశారు.
గతంలో ఉల్లి ధరలు పెరిగిన సమయంలో ఉల్లిపాయలు తిననని నిర్మలాసీతారామన్ సమాధానం చెప్పడం వల్లే సిద్దార్థ్ తన ట్వీట్ లో ఉల్లిపాయల గురించి ప్రస్తావిస్తూ సెటైర్లు వేశారు.సిద్దార్థ్ నిర్మతా సీతారామన్ ను ఆంటీ అని సంభోదించడం గమనార్హం.
పెట్రోల్, డీజిల్ ధరలు రాబోయే రోజుల్లో మరింత పెరుగుతాయో, తగ్గుతాయో చూడాల్సి ఉంది.