గత కొన్ని రోజులుగా అంతరిక్ష యాత్రలపై అన్ని దేశాల మీడియాలతో పాటు సామాజిక మాధ్యమాల్లో విస్తృతమైన కథనాలు వెలువడుతున్న సంగతి తెలిసిందే.‘వర్జిన్ గెలాక్టిక్’ సంస్థ అధినేత – బ్రిటీషర్ రిచర్డ్ బ్రాన్సన్ జూలై 11న, అది జరిగిన సరిగ్గా తొమ్మిది రోజులకు జూలై 20న ఆ సంస్థకు బలమైన ప్రత్యర్థి ‘బ్లూ ఆరిజన్’ అధినేత– అమెరికన్ వ్యాపారి జెఫ్ బెజోస్ తమ బృందాలతో రోదసీ విహారం చేసి వచ్చారు.
వీటి తర్వాత ‘టెస్లా’ సంస్థ అధినేత ఎలన్ మస్క్ తన ‘స్పేస్ ఎక్స్’ని కూడా అంతరిక్షంలో పంపారు.
ప్రయోగాలకు సంబంధించి ఈ కుబేరుల మధ్య వైరం నడుస్తున్న సంగతి తెలిసిందే.
బ్లూ ఆరిజన్, స్పేస్ ఎక్స్లు కొత్త కొత్త ప్రణాళికలతో అంతరిక్ష రంగంలోకి దూసుకెళ్తున్నాయి.దీంతో తాను పోటీలో వెనుకబడ్డానని ప్రకటించిన వర్జిన్ గెలాక్టిక్ అధినేత రిచర్డ్ బ్రాన్సన్ కీలక ప్రకటన చేశారు.2023లో ఒకే నెలలో మూడు రోదసీ యాత్రలు చేపడుతున్నట్లు తెలిపారు.కంపెనీ తన క్యారియర్ ఎయిర్ప్లేన్కు అప్గ్రేడ్లను పూర్తి చేసి సెకండ్ స్పేస్ షిప్ను ప్రవేశపెట్టిన తర్వాత నెలకు మూడు రోదసీ యాత్రలను నిర్వహించాలని భావిస్తున్నట్లు వర్జిన్ గెలాక్టిక్ సీఈవో మైఖేల్ కోల్ గ్లాజియర్ తెలిపారు.
గత నెలలో పెట్టుబడిదారులతో జరిగిన సమావేశం సందర్భంగా 2022 నాల్గవ త్రైమాసికం నాటికి వాణిజ్య విమానాల ప్రారంభం ఆలస్యమవుతుందని చెప్పినట్లు సీఈవో వెల్లడించారు.ఈ సమయంలో స్పేస్ ఫ్లైట్కు అదనపు మెరుగులు, సౌకర్యాలు కల్పించవచ్చని మైఖేల్ అభిప్రాయపడ్డారు.
వీఎస్ఎస్ ఇమాజిన్ స్పేస్షిప్… 2023 ప్రారంభంలో విమాన పరీక్షలను ప్రారంభించనుందని ఆయన వెల్లడించారు.
ఇకపోతే.కంపెనీ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్ అంతరిక్షంలోకి వెళ్లినప్పటి నుంచి రోదసిలోకి వెళ్లేందుకు పలువురు ఉవ్విళ్లూరుతున్నారు.అంతరిక్ష ప్రయాణానికి గాను ఒక్కో టికెట్ ధరను 4,50,000 డాలర్లు (రూ.3.33 కోట్లు)గా వర్జిన్ గెలాక్టిక్ నిర్ణయించింది.అయితే, గతంతో పోలిస్తే, టికెట్ రేటును రెట్టింపు చేయడం గమనార్హం.2005, 2014లో జరిపిన టికెట్ బుకింగ్ సేల్లో ఒక్కో సీటుకు 2-2.5 లక్షల డాలర్ల చొప్పున వసూలు చేశారు.నాటి సేల్లో 600 మంది సీట్లను బుక్ చేసుకున్నారు.
అయితే, ఇటీవల జరిపిన స్పేస్ యాత్ర విజయవంతం కావడంతో ‘వర్జిన్ గెలాక్టిక్’ టికెట్ రేట్లను అమాంతం పెంచినట్టు తెలుస్తున్నది.బ్రాన్సన్ బృందం రోదసీ యాత్ర తర్వాత 100 టికెట్లను విక్రయించినట్లు వర్జిన్ గెలాక్టిక్ సోమవారం తన ఆర్ధిక ఫలితాల్లో తెలిపింది.