ప్రస్తుత సమాజంలో బాహ్య ప్రపంచంలోనే కాకుండా తన ఇంట్లో కూడా రక్షణ కరువైందని కొన్ని సంఘటనలు చూస్తే మనకు బాగా అర్థమవుతుంది.అందుకు ఉదాహరణగా హైదరాబాదులోని నగరంలోని షేక్ పేట ప్రాంతంలో జరిగిన ఓ సంఘటన ఉదాహరణగా చెప్పవచ్చు.
వివరాల్లోకి వెళితే స్థానిక ప్రాంతానికి చెందిన శివకుమార్ అనే యువకుడికి తన దగ్గర బంధువు అయినటువంటి సౌమ్య అనే యువతితో ఈ సంవత్సరంలోని మే నెలలో వివాహం అయ్యింది.అయితే పెళ్ళైన మొదట్లో ఇద్దరూ కలిసి ఎంతో అన్యోన్యంగా ఉండేవారు.
అయితే గత కొద్ది రోజులుగా ఏమైందో ఏమో గాని ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి.దీంతో శివ కుమార్ సౌమ్య ను అదనపు కట్నం తీసుకురావాలంటూ తరచూ చిత్రహింసలకు గురిచేసేవాడు.
ఈ విషయమై పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయతీలు పెట్టి ఇద్దరికీ సర్దిచెప్పి సౌమ్యను కాపురానికి పంపించేవారు ఆమె తల్లిదండ్రులు.
అయినా కూడా శివకుమార్ వినేవాడు కాదు తరచూ ఆమెను సూటిపోటి మాటలతో వేధిస్తూ ఉండగా భర్త వేధింపులు తాళలేక సౌమ్య ఇరవై రోజుల క్రితం తన పుట్టింటికి వచ్చేసింది.దీంతో మానసికంగా కుంగిపోయింది.అయితే నిన్న ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఆత్మహత్య చేసుకుంది.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ పోస్టుమార్టం చేసిన వైద్యులు ఆమె ప్రస్తుతం నాలుగు నెలల గర్భవతి అని నిర్ధారించారు.దీంతో పెళ్లై సంతోషంగా జీవితం గడపాల్సిన కూతురు ఆరు నెలలకే ఆత్మహత్య చేసుకుని చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు బోరున విలపించారు.
అనంతరం శివ కుమార్ పై సంబంధిత పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు శివ కుమార్ ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
.