ఘోర రోడ్డు ప్రమాదం వారి స్నేహాన్ని చిదిమేసింది.ఒకేసారి నలుగురు స్నేహితుల ప్రాణాలు తీసింది.
ఆ నలుగురు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.వారి తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది ఆ రోడ్డు ప్రమాదం.
తాజాగా గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఎంతో భవిష్యత్తు ఉన్న నలుగురు యువకులను పొట్టన పెట్టుకుంది.
వివరాల్లోకి వెళితే… నరసరావుపేటకు చెందిన వెంకట శ్రీ చందు, వింజమూరి హరికృష్ణ, షేక్ ఫెరోస్ మహ్మద్, రాజుపాలెం మండలం ఇని మెట్ల గ్రామానికి చెందిన అత్తులూరి బలరాం స్నేహితులు.
అయితే ఈ నలుగురు స్నేహితులు ఓ పని నిమిత్తం కారులో నరసరావుపేట నుంచి విజయవాడకు బయలుదేరారు.కానీ వీరి స్నేహాన్ని చూసి విధి ఓర్వ లేక పోయింది.
రోడ్డు ప్రమాదం రూపంలో ఈ నలుగురు యువకులను కబలించింది మృత్యువు.తిమ్మాపురం వద్ద గుంటూరు వైపు నుంచి వస్తున్న భారీ కంటైనర్ లారీ అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది.
అదే క్రమంలో అవతలివైపు నుంచి వెళుతున్న కారును బలంగా ఢీ కొట్టడంతో… ఆ ధాటికి కార్ మొత్తం నుజ్జు నుజ్జు అయిపోయింది.దీంతో ఆ కారులో ప్రయాణిస్తున్న నలుగురు స్నేహితులు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు.
ఇక లారీని అక్కడే వదిలేసిన లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు.ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.