తెలంగాణలో బలం పెంచుకునేందుకు కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.అధికార పార్టీ టిఆర్ఎస్ తో పాటు, ఇప్పుడిప్పుడే బలం పెంచుకుంటున్న బీజేపీని ఎదుర్కొనే విధంగా అనేక రాజకీయ వ్యూహాలకు దిగుతోంది.
ముఖ్యంగా ప్రజా సమస్యలపై పోరాడుతూ, ప్రజల్లో బలం పెంచుకునే విషయంపై ఎక్కువ ఫోకస్ పెట్టింది.దీనిలో భాగంగానే పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలు ఉండేలా కాంగ్రెస్ ప్లాన్ చేసుకుంటోంది.
టిఆర్ఎస్ లోని అసంతృప్త నేతల పై దృష్టి పెట్టి వారిని కాంగ్రెస్ లో చేరే విధంగా ప్రయత్నాలను ముమ్మరం చేసింది.చేరికలపై కాంగ్రెస్ స్పీడ్ పెంచడం తో బీజేపీ, టీఆర్ఎస్ లు సైతం తమ పార్టీల్లో అసంతృప్త నేతలను గుర్తించి వారికి ప్రాధాన్యం ఇచ్చే విధంగా ప్రయత్నాలు మొదలు పెట్టాయి.
ఇప్పటికే సీనియర్ కాంగ్రెస్ నేతగా తెలంగాణలో ప్రత్యేక గుర్తింపు పొందిన దివంగత పీజేఆర్ కుమార్తె, ఖైరతాబాద్ టీఆర్ఎస్ కార్పొరేటర్ విజయ రెడ్డి ని కాంగ్రెస్ లో చేర్చుకున్నారు.తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో టిఆర్ఎస్ లో కీలకంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, కరకగూడెం జడ్పిటిసి కాంతారావు తో పాటు , మరో ఇద్దరు కాంగ్రెస్ చేరనున్నారు.
ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో వారు పార్టీలో చేరబోతున్నారు.రెండు రోజుల క్రితం జరిగిన ఓ సమావేశంలో టిఆర్ఎస్ నేతల తీరుపై తాటి వెంకటేశ్వర్లు విమర్శలు చేశారు.
జిల్లాలో పార్టీ పరిస్థితి అద్వానంగా ఉందని, టీఆర్ఎస్ అధిష్టానం జోక్యం చేసుకోవాలని ఆయన బహిరంగంగానే విమర్శలు చేశారు.ఈ క్రమంలోనే నిన్న కరకగూడెం టిఆర్ఎస్ జెడ్పిటిసి కాంతారావు కాంగ్రెస్ లో చేరగా, తాటి వెంకటేశ్వర్ల తో పాటు మరో ఇద్దరు నేడు రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారు.ఈ విధంగా ప్రతి జిల్లా, నియోజకవర్గంలోనూ బలమైన నేతలను కాంగ్రెస్ లో చేర్చుకుని 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువచ్చే విధంగా రేవంత్ వ్యూహాలు పన్నుతున్నారు.